సీఎం జగన్ కీలక నిర్ణయం.. రాజధాని, మండలి రద్దుపై కేంద్రంతో సంప్రదింపులు.. మోదీ, షాతో భేటీ
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అంశంతోపాటు శాసన మండలి రద్దు, ఇతర ముఖ్యాంశాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని డిసైడయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏపీ సర్కారు మంగళవారం ఒక ప్రకటన జారీచేసింది. బుధవారం సాయంత్రం 4:30కు ఆయన విజయవాడ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. సీబీఐ కేసుల్లో కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు విషయంపైనా ఢిల్లీ పెద్దలతో జగన్ మాట్లాడుతారని తెలుస్తోంది.

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి షాతో..
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. రాజధాని మార్పు, మండలి రద్దు నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి కావడం, ఆ వ్యవహారాలన్నీ కేంద్ర హోం శాఖతో ముడిపడి ఉన్న నేపథ్యంలోనే మోదీ, షాను కలవాలని సీఎం నిర్ణయించుకున్నారు. అసలు ఏపీలో మూడు రాజధానుల్ని ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నది, శాసన మండలిని ఎందుకు రద్దు చేసింది ప్రధాని, కేంద్ర హోం మంత్రికి సీఎం వివరించనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి.
Recommended Video

చంద్రబాబును ఇరుకున పెట్టేలా..
టీడీపీ చీఫ్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా భారీ ఎత్తున భూఅక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఆ మేరకు ఏర్పాటైన సీఐడీ ఇన్వెస్టిగేషన్ టీమ్... ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి కీలక ఆధారాలను సేకరించింది. వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా విచారణ ప్రారంభించింది. చంద్రబాబుపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలంటూ వైసీపీ ఎంపీలు లోక్ సభలోనూ డిమాండ్ చేశారు. చంద్రబాబును మరింత ఇరుకున పెట్టే అంశాలపైనా సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనలో ఫోకస్ పెట్టబోతున్నట్లు సమాచారం.

కేంద్రం గ్రీన్ సిగ్నల్?
రాజధాని తరలింపు, శాసన మండలి రద్దు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండబోదని, రాష్ట్ర ప్రభుత్వం చేసి పంపే తీర్మానాలను యధావిధిగా ఆమోదిస్తుందని బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు వరుసగా ప్రకటనలు చేస్తుండటం తెలిసిందే. ఏపీ సీఎంతో భేటీలో ప్రధాని, కేంద్ర హోం మంత్రి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తారని, రాజధాని, మండలి రద్దు విషయంలో వైసీపీ సర్కారుకు ఢిల్లీలో గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే నేతల భేటీ ముగిసిన తర్వాతే దీనిపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశముంది.

ప్రత్యేక హోదా.. సీబీఐ కేసులు..
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో రాజధాని, మండలి రద్దు అంశాలే ప్రధానమైనప్పటికీ.. ఏపీకి ప్రత్యేక హోదా, పెండింగ్ నిధులపైనా సీఎం వినతి పత్రాలు సమర్పించనున్నారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్.. ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యే విషయంలో కొంతకాలంగా గందరగోళం నెలకొనడం, తాను సీఎం హోదాలో ఉన్నాను కాబట్టి, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ప్రధాని, కేంద్ర హోం మంత్రి వద్ద సీఎం జగన్ ప్రస్తావించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications