తెలంగాణ మూర్ఖంగా వ్యవహరిస్తోంది: సీమ లిఫ్ట్ కు అనుమతివ్వండి : కేంద్ర మంత్రులకు సీఎం జగన్ లేఖ..!!
తెలంగాణ - ఏపీ మధ్య నీటి జగడం పైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రులకు లేఖలు రాసారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్..పర్యావరణ శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు రాసిన లేఖల్లో కీలక అంశాలను ప్రస్తావించారు. ఉమ్మడి ప్రాజక్టుల్లో సాగు..తాగు..విద్యుత్ కోసం వినియోగించే నీటిని క్రిష్ణా బోర్దు పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి కోరారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తోందని సీఎం జగన్ లేఖలో వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఈనెల 1 నుంచి ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించుకుందని వివరించారు.

తెలంగాణ యధేచ్చగా...
796 అడుగుల నీటిమట్టం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తోందని కేంద్ర మంత్రికి వివరించారు. శ్రీశైలంలో 854 అడుగుల నీరు లేకుంటే కరువు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించే అవకాశం లేదు. పాలమూరు రంగారెడ్డి, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 800 అడుగుల వద్ద పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ నిర్మిస్తోంది. ఈ అక్రమ ప్రాజెక్టు వల్ల శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉండే అవకాశాలు లేవని సీఎం జగన్ తన లేఖలో చెప్పుకొచ్చారు. కేఆర్ఎంబీ పదే పదే ఏపీలో పర్యటన కోసం అడగటాన్ని సీఎం ఆక్షేపించారు. ముందుగా తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టుల ప్రాంతాల్లో పర్యటించిన తరువాత ఏపీలోకి వెళ్లేలా కేఆర్ఎంబీని ఆదేశించాలని సూచించారు.

మూర్ఖంగా తెలంగాణ ముందుకు..
తెలంగాణ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని...నిబంధనలకు విరుద్దంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఫిర్యాదు చేసారు. రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కాదని..నీటిని నిల్వ చేసుకొనేందుకు మాత్రమే వినియోగిస్తామని జగన్ స్పష్టం చేసారు. ఈ ఎత్తిపోతలకు కేంద్ర పర్యావరణ శాఖ నుండి అనుమతులు ఇవ్వాలని పర్యావరణ శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు రాసిన లేఖ లో సీఎం జగన్ కోరారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. జూన్ 1 నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా పరిధిలో ఇరిగేషన్ అవసరాలు లేకుండా తెలంగాణ నీటిని వినియోగిస్తోందని కేంద్రానికి నివేదించారు.
Recommended Video

పర్యావరణ అనుమతి ఇవ్వండి
విద్యుత్ ఉత్పత్తి కోసమే ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించిందని లెక్కలు చెప్పుకొచ్చారు. 854 అడుగులకు చేరితే గానీ పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకునే అవకాశం లేదంటూ లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలవనరుల కమిషనర్కు పూర్తి డీపీఆర్ను అందజేశామని.. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిందిగా లేఖలో సీఎం జగన్ కోరారు.












Click it and Unblock the Notifications