జగన్ నిర్ణయాలతో మోదీకి తల నొప్పులు.. ఏపీ తో పాటుగా కేంద్రానికి జపాన్ లేఖ
ఆంధ్రప్రదేశ్లో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలను పునఃసమీక్షించడం సరికాదని దీనివల్ల విదేశీ పెట్టుబడిదారులకు తీరని నష్టం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్కు హెచ్చరించింది జపాన్. ఇలా చేయడం వల్ల వాణిజ్య వాతావరణం కూడా దెబ్బతింటుందని పేర్కొంది. పునరుత్పాదక శక్తి రంగంలో విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఇలా పెట్టుబడులు పెట్టిన వాటిలో ఫ్రాన్స్ సంస్థలు, దక్షిణాఫ్రికా సంస్థలు, యూరప్ సంస్థలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో తీవ్ర ప్రభావం చూపుతుందని..ఎందుకంటే చాలా వరకు రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టాయని పారిశ్రామికవేత్తలు తెలిపారు.

సీఎం జగన్కు జపాన్ అంబాసిడర్ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను చాలామంది విదేశీ పెట్టుబడిదారులతో పాటు జపాన్ కూడా నిశితంగా పరిశీలిస్తోందని సీఎం జగన్కు భారత్లో ఉంటున్న జపాన్ రాయబారి కెంజీ హిరమత్సు లేఖ రాశారు. భారత్లో ఉన్న రెండు అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థల్లో సింహభాగంగా జపాన్ పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో జపాన్కు చెందిన ఎస్బీ ఎనర్జీ అత్యధిక పెట్టుబడులు పెట్టింది. భారత్లో 20గిగావాట్ల ప్రాజెక్టులకు సంబంధించి ఎస్బీ ఎనర్జీ పెట్టుబడులు పెట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను జపాన్ ఎంబసీ దృష్టికి తీసుకెళ్లింది. చట్టపరంగా జరిగిన ఒప్పందాలను రద్దు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాణిజ్య పరంగా దెబ్బతింటుందని హెచ్చరించారు జపాన్ ఎంబసీ రెండో కార్యదర్శి సతోషి టకాగి.

చట్టపరంగా జరిగిన ఒప్పందాలను ఎలా రద్దు చేస్తారు..?
ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం వైయస్ జగన్ టీడీపీ హయాంలో కుదుర్చుకున్న పీపీఏలను పునఃసమీక్షించారు. ఇతర రాష్ట్రాల్లో కంటే సుంకం అధికంగా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. అంతేకాదు ఈ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని చెప్పారు. వీటిని పునఃసమీక్షించాలంటూ ఓ ప్రత్యేక కమిటీని సైతం నియమించారు సీఎం జగన్. దీంతో ప్రాజెక్టు డెవలపర్లు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ నిర్ణయాలపై పునఃసమీక్షించాలంటూ జపాన్ రాయబారీ సీఎం జగన్కు రాసిన లేఖలో కోరారు. అంతేకాదు చట్టపరంగా జరిగిన ఒప్పందాలను రద్దు చేయడం భావ్యం కాదన్న జపాన్ రాయబారి... వాతావరణం, భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే రెన్యూవబుల్ ఎనర్జీ రంగం ముఖ్యపాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. అందుకోసమే ఎక్కువ పెట్టుబడులు ఈ రంగంలో తమ దేశం పెట్టినట్లు చెప్పారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ కూడా ఇంతకుముందు సీఎం జగన్కు పీపీఏ నిర్ణయాలపై పునఃసమీక్షించాలంటూ లేఖ రాసిన సంగతి తెలిసిందే.

మోడీకి జగన్ కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారా..?
సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రధాని మోడీకి కొత్త తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక జపాన్ దేశంతో ఇటు దౌత్యపరంగా అటు వాణిజ్య పరంగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే జపాన్ ప్రధాని షింజో అబే భారత్లో పర్యటించడం, మోడీ కూడా జపాన్లో పర్యటించి భారత్కు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. ఇక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు రూ.5500 కోట్లు మేరా రుణం అతి తక్కువ వడ్డీతో జపాన్ అంతర్జాతీయ సహకారం ఏజెన్సీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు రంగాల్లో జపాన్ సంస్థలు భారీగా అంటే రూ. 23వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. అంతేకాదు దేశం మొత్తం మీద చాలా చోట్లు భారీ పెట్టుబడులు పెట్టాయి జపాన్ సంస్థలు. అదే సమయంలో రుణాలు కూడా ఇచ్చాయి.

ఇతర రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపే అవకాశం
ఇక ఈ సమయంలో ఒక్క రాష్ట్రానికి నెగిటివ్గా జపాన్ రాయబారి లేఖ రాస్తే ఈ ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీకి నిజంగానే తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మొన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఏపీ సీఎం జగన్ ఈ ఒప్పందాలకు సంబంధించి మాట్లాడినట్లు సమాచారం. అయితే కేంద్రం జగన్కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుందా... ఒక వేళ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తు సీఎం జగన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా అనేది చర్చనీయాంశమైంది. మరోవైపు మోడీకి అత్యంత దగ్గర సంబంధాలున్న జపాన్ నుంచి లేఖ రావడంతో సీఎం జగన్కు మోడీ ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశం చాలా సున్నితమైనది కావడంతో దీని ప్రభావం ఒక్క ఏపీ రాష్ట్రంపైనే ఉండదని... ఇతర రాష్ట్రాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications