వైఎస్ జగన్-వైఎస్ షర్మిల ఒకే చోట..ఈ సారైనా: కడప జిల్లా పర్యటన తేదీలు ఇవే
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించనున్నారు. సొంత జిల్లా పర్యటనకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రోగ్రామ్ మినిట్స్ వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం వైఎస్ జగన్.. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. భార్య వైఎస్ భారతితో కలిసి ఆయన సిమ్లాలో పర్యటిస్తోన్నారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. విరామం కోసం సిమ్లా వెళ్లారు వైఎస్ జగన్.
పీవీ సింధుకి 'మెగా' సన్మానం: హాజరైన సినీ ప్రముఖులు (ఫోటోలు)
తేదీలు ఇవే..
అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే సొంత జిల్లా కడపకు బయలుదేరి వెళ్తారు. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో తన సొంత నియోజకవర్గం పులివెందులలో గడుపుతారు. సెప్టెంబర్ 2వ తేదీ.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి. ఆ రోజున ఆయన ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధిని సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ఈ ప్రార్థనలకు హాజరవుతారు.
మధ్యాహ్నానికి ఇడుపులపాయకు..
సెప్టెంబర్ 1వ తేదీన బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరి వెళ్తారు. కడప విమానాశ్రయంలో దిగిన తరువాత.. హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటి ఉదయం ఆయన తండ్రి సమాధిని సందర్శిస్తారు. నివాళి అర్పిస్తారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందులలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం ఆయన మళ్లీ తాడేపల్లికి వెళ్తారు.
వైఎస్ షర్మిలతో కలిసి..
ఇదే కార్యక్రమానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా హాజరుకానున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయమే ఆమె ఇడుపులపాయకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తన అన్న వైఎస్ జగన్తో కలిసి వైఎస్ షర్మిల.. తండ్రి సమాధి వద్ద నివాళి అర్పిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. తండ్రి వర్ధంతి కావడం వల్ల విజయమ్మతో కలిసి వారిద్దరూ వైఎస్సార్కు నివాళి అర్పిస్తారని, ఆ తరువాత ప్రత్యేక ప్రార్థనలకు హాజరవుతారని సమాచారం.
జయంతి నాడు అలా..
ఈ ఏడాది జులై 8వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ జగన్-వైఎస్ షర్మిల ఎదురుపడలేదనే విషయం తెలిసిందే. వారిద్దరూ తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించినప్పటికీ.. ఒకరినొకరు తారసపడకుండా దానికి సంబంధించిన షెడ్యూల్ను రూపొందించుకున్నారు. తొలుత తన చెల్లెలు వైఎస్ షర్మిల నివాళి అర్పించి వెళ్లిన తరువాతే.. వైఎస్ జగన్ ఇడుపులపాయకు వెళ్లారు. వైఎస్సార్ సమాధి వద్ద నివాళి అర్పించారు. ఈ సారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది.
బద్వేలు ఉప ఎన్నికపై
బుధవారం రోజు సాయంత్రం వైఎస్ జగన్.. కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన జిల్లా నాయకులతో సమావేశమౌతరని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన సభ్యుడు డాక్టర్ జీ వెంకట సుబ్బయ్య మృతి చెందడం వల్ల ఖాళీ అయిన బద్వేలు అసెంబ్లీ స్థానం గురించి సమీక్షిస్తారని సమాచారం.
ఉప ఎన్నికలో పార్టీ తరఫున ఎవరిని నిలబెట్టాలనే విషయంపై ప్రాథమికంగా చర్చిస్తారని చెబుతున్నారు. వెంకట సుబ్బయ్య కుటుంబానికే టికెట్ ఇవ్వాలా? లేక బయటి వ్యక్తులను రంగంలో దించాలా? అనే విషయంపై ఈ సమీక్ష సందర్భంగా తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం.