Mega Dsc: మెగా డీఎస్సీపై తేల్చేసిన ఏపీ సర్కార్..! ఎంపిక, మెరిట్ లిస్ట్ పైనా..!
ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీ (Mega DSC)లో అక్రమాలు జరిగాయంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం ఇవాళ స్పందించింది. విద్యాశాఖ తరఫున అధికారులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. మెగా డీఎస్సీ' నిర్వహణపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, డీఎస్సీని పూర్తి పారదర్శకంగా నిర్వహించామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. కమిషనర్, ఇతర అధికారులతో కలిసి ఆయన డీఎస్సీ జరిగిన తీరుపై వివరణ ఇచ్చారు.
2024 జూన్ 13న మెగా డీఎస్సీ ఫైల్పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని, 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించామని కోన శశిధర్ తెలిపారు. మెరిట్ ఆధారంగానే డీఎస్సీలో నియామకాలు జరిగాయని ఆయన వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఇతర రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. టాటా ఆయన్ ఆధ్వర్యంలో, మల్టీ లెవెల్ డిజిటల్ సెక్యూరిటీతో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రశ్నపత్రాల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సీబీటీ విధానంలో మెగా డీఎస్సీ నిర్వహణతో, ప్రశ్నపత్రాల లీకేజీకి అవకాశం లేదని కోన శశిధర్ తెలిపారు.

డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్ధుల మార్కులను వెబ్ సైట్ లో ప్రచురించినట్లు ఆయన తెలిపారు. తాము వెబ్ సైట్ లో మెరిట్ లిస్ట్ పెట్టలేదన్న ఆరోపణల్ని ఖండించారు. దరఖాస్తు సమయంలోనే అన్ని సర్టిఫికెట్లు సమర్పించాలని తాము కోరామని, అయితే కొందరు అభ్యర్ధులు ఈ నిబంధన సడలింపు కోరడంతో మార్చినట్లు వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 1-3 నిష్పత్తిలో అభ్యర్ధుల్ని పిలిచామని తెలిపారు. అర్హత ఉన్న వారిని ఎవరినీ పక్కనబెట్టలేదని, పూర్తి పారదర్శకతతోనే పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చామని కోన శశిధర్ తెలిపారు.












Click it and Unblock the Notifications