ఏపీ కరోనా అప్డేట్ : వరుసగా రెండోరోజు 10 వేల కొత్త కేసులు- మరణాల్లోనూ తగ్గుదల
ఏపీలో కరోనా కేసుల కల్లోలం కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండోరోజు రాష్ట్రంలో 10 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. అటు మరణాల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది. దీంతో ప్రభుత్వానికి కాస్త ఊరట లభిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 10373 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా కారణంగా 80 మంది చనిపోయారని ప్రభుత్వం హెల్త్ బులిటెన్లో పేర్కొంది.
ఏపీలో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల్ని గమనిస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1880 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చిత్తూరులో 1728, పశ్చిమగోదావరిలో 1078, అనంతపురంలో 1002 కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో చూస్తే విశాఖలో 693, గుంటూరులో 691, ప్రకాశంలో 659, కృష్ణాలో 511, కర్నూల్లో 505, కడపలో 475, నెల్లూరులో 459, శ్రీకాకుళంలో 383, విజయనగరంలో 309 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో 17.49 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 16 లక్షల మంది కోలుకున్నారు. మరో 1.28 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
మరణాల విషయానికొస్తే గత 24 గంటల్లో అత్యదికంగా చిత్తూరులో 12 మంది కరోనాతో చనిపోయారు. ఆ తర్వాత స్ధానాల్లో అనంతపురం 9, శ్రీకాకుళం 9, విజయనగరం 9, కర్నూలు 6, నెల్లూరు 6, పశ్చిమగోదావరి 6, తూర్పుగోదావరి 5, గుంటూరులో ఐదుగురు, విశాఖలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఒక్కరు చనిపోయారు. వీటితో కలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనాతో చనిపోయన వారి సంఖ్య 11376కు చేరింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 15958 మంది కోలుకున్నారు.