థ్యాంక్యూ పీఎం: మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ, ప్రశంసల వర్షం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం భేటీ అయ్యారు. పార్లమెంట్ భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. జలజీవన్ మిషన్ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై ప్రధాని మోడీతో చర్చించారు.
ఆ తర్వాత ప్రధాని మోడీపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. 'ప్రధాని నరేంద్ర మోడీ నాపై చూపే అభిమానం.. అప్యాయత ఎంతో విలువైనది. పార్లమెంటు సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించారు. గాంధీనగర్లో మోడీతో నా తొలి సమావేశం నుంచి ఈ భేటీ వరకు, మోడీకి పని పట్ల ఉన్న నిబద్ధత, దేశం పట్ల ఉన్న ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం' అంటూ పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.

ఈ సందర్బంగా ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞలు తెలిపారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ను పవన్ కళ్యాణ్ కలిశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని పవన్ మండిపడ్డారు. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణా జరగడమే శోచనీయంగా ఉంది. ఏపీకి చెందిన రూ. 110 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు కర్ణాటకలో దొరికాయి. వాటిని ఆ రాష్ట్రం విక్రయించింది. విదేశాల్లో దొరికినా భారతదేశానికి తిరిగి తీసుకురావచ్చు. కానీ, పొరుగు రాష్ట్రం నుంచి వాటిని వైసీపీ ప్రభుత్వం ఏపీకి తిరిగి తీసుకురాలేకపోయిందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆ ఎర్రచందనంను తిరిగి ఏపీకి తీసుకువచ్చే అంశంపై కేంద్రమంత్రితో చర్చించినట్లు తెలిపారు.
I am grateful to Hon PM. Shri @narendramodi Ji for giving his valuable time amidst hectic parliament sessions. From my first meeting in Gandhinagar till this meeting, it was always filled with warmth and I always leave the meeting with admiration for him and his commitment and… pic.twitter.com/mu9RtgcwPQ
— Pawan Kalyan (@PawanKalyan) November 27, 2024
అదానీ వపర్ ప్రాజెక్టు అంశం గురించి ఆయన మాట్లాడారు. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగింది? దీనిపై పూర్తి అవగాహన అవసరం అని పవన్ అన్నారు. మరోవైపు, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్ ఏర్పడటానికి భారత సైన్యం చేసిన త్యాగాలు మరవకూడదన్నారు. ఇక్కడ మైనార్టీలను ఎలా చూస్తున్నాం? అక్కడ మైనార్టీ హిందువులను ఎలా చూస్తున్నారు? అని ప్రశ్నించారు. పాలస్తీనాలో ఏదైనా జరిగినప్పుడు స్పందించే ప్రముఖులు.. బంగ్లాదేశ్లో జరిగే ఈ దుర్ఘటనలపై ఎందుకు స్పందించరు? అని పవన్ నిలదీశారు.
కాగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్.. ఢిల్లీలో ప్రధానితోపాటు కేంద్రమంత్రులతో భేటీ కావడం ఇదే తొలిసారి. మరోవైపు, పవన్ను బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు.












Click it and Unblock the Notifications