ఏపీ డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్కు భారీ ఊరట..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుకు (Raghurama Krishnam Raju) సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2022లో హైదరాబాద్లో నమోదైన కానిస్టేబుల్ ఫరూక్ బాషా (Farooq Basha)పై దాడి కేసుకు సంబంధించి ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఘటన నేపథ్యం..
2022లో హైదరాబాద్ గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్లోని రఘురామ కృష్ణంరాజు నివాసం వద్ద కానిస్టేబుల్ ఫరూక్ బాషా అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆయన భద్రతా సిబ్బంది పట్టుకుని ప్రశ్నించారు. ఐడీ, ఆధార్ కార్డులు చూపించమని అడిగినా నిరాకరించడంతో గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. అనంతరం దర్యాప్తులో ఫరూక్ ఏపీ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ అని తేలింది.

దీనిపై రఘురామ పీఏ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా అది పట్టించుకోలేదు. కానీ, విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి జరిగిందంటూ ఫరూక్ బాషా రఘురామ, ఆయన కుమారుడు భరత్, మరో ఇద్దరిపై ఫిర్యాదు చేశారు. దీంతో దాడి కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది.
న్యాయపరమైన పోరాటం..
ఈ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ తిరస్కరించబడింది. దీంతో 2022 జూలై 12న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి పరిస్థితులను వివరించిన రఘురామ, తనకు వై కేటగిరీ భద్రత ఉన్నందున అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని విచారించటం సహజమని వాదించారు.
సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన అనంతరం, కానిస్టేబుల్ ఫరూక్ బాషా కూడా ఈ కేసును కొనసాగించదలుచుకోవడం లేదని అఫిడవిట్ సమర్పించారు. హైదరాబాదు తన విధి నిర్వహణ ప్రాంతం నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఇలాంటి కేసు కొనసాగించడం ఇష్టం లేదని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు..
జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం ఫరూక్ బాషా అఫిడవిట్ను పరిగణనలోకి తీసుకుని సోమవారం విచారణ చేపట్టింది. ఆ తరువాత రఘురామ కృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్తో పాటు సిబ్బందిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో కొన్నేళ్లుగా నడుస్తున్న ఈ కేసులో రఘురామ కృష్ణరాజుకు ఊరట లభించింది.












Click it and Unblock the Notifications