విషజ్వరాల దండయాత్ర - ఈ లక్షణాలతో బీ అలర్ట్..!!
రాష్ట్రంలో చికున్ గున్యా దాడి చేస్తోంది. 9 జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న జ్వరాలతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. జ్వరం, కీళ్ల నొప్పులు, ఒంటిపై దద్దుర్లతో ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం తగ్గినా.. వదలని కీళ్ల నొప్పులతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ బాధితులకు చికున్ గున్యాగా పుణె వైరాలజీ ల్యాబ్ నిర్ధారించింది. దీంతో, ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీజనల్ వ్యాధులపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది.
విష జ్వరాలతో
రాష్ట్రంలో పలు జిల్లాల్లో చికున్ గున్యా జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజులుగా విష జ్వరాలతో జనం అల్లాడుతున్నారు. చికున్ గున్యా లక్షణాలున్న జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జ్వరం, కీళ్ల నొప్పులు, కీళ్లు బిగుసుకుపోయి నడవలేకపోవడం వంటి లక్షణాలతోపాటు కాళ్లు, చేతుల వాపు, ఒంటిపై ర్యాష్తో రోగులు బాధపడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ తరహా జ్వరాలు వెలుగులోకి రావడంతో వైద్య ఆరోగ్య శాఖాధికారులు రోగుల నుంచి సీరం నమూనాలను సేకరించి పరీక్షించారు. ఇక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్ష కిట్లలో అవి చికున్ గున్యా జ్వరాలుగా నిర్ధారణ కాలేదు.

చికున్ గున్యాగా
అనంతరం 12 సీరం నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్కు పంపగా అవి చికున్ గున్యా జ్వరాలుగా నిర్ధారణ అయ్యింది. చికున్ గున్యా జ్వరాలు రెండు దశాబ్దాల కిందట తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో వెలుగులోకి వచ్చాయి. జ్వరం, కీళ్ల నొప్పులు, కీళ్లు బిగుసుకుపోయి నడవలేకపోవడం వంటి లక్షణాలతో అప్పట్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవే లక్షణాలతో చికున్ గున్యా జ్వరాలు మళ్లీ రాష్ట్రంలో విజృంభిస్తున్నాయి. తూర్పుగోదావరి, అనంతపురం, పశ్చిమగోదావరి, విశాఖ, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, అల్లూరి, గుంటూరు జిల్లాల్లో ఈ జ్వరాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి.
అప్రమత్తంగా
వైరల్ ఫీవర్లు కావడంతో ఇంట్లో ఒకరు జ్వరం బారినపడితే.. ఇంటిల్లిపాదీ వీటికి గురౌతున్నారు. బాధితుల్లో జ్వరం, కీళ్ల నొప్పులు, పాదాలు, చేతుల వాపు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వరం తగ్గుతున్నా, కొంతకాలం వరకు కీళ్ల నొప్పులు వదలటం లేదు. మెజార్టీ రోగుల్లో 4-6 వారాల పాటు కీళ్ల నొప్పులు వేధిస్తున్నట్లు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో జ్వరాలు తగ్గిపోతున్నా... కీళ్ల నొప్పులు అధికంగా ఉన్న రోగులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందాల్సి వస్తోంది. వ్యక్తిగత శుభ్రత అవసరమని..అర్హుల వద్దే చికిత్స చికిత్స పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications