AP EAPCET 2021 Results : ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) ఫలితాల విడుదల -ఇంజనీరింగ్ మాత్రమే
ఏపీలో ఎంసెట్ స్ధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ఈఏపీ సెట్ 2021 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడ బందర్ రోడ్డులో ఉన్న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇవాళ కేవలం ఇంజనీరింగ్ కేటగిరీ ఫలితాలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 80 శాతం మంది అర్హత సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈసారి ఏపీ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ పరీక్షను ఆగస్టు 20, 23, 24, 25 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన వారిలో 80 శాతం మంది అంటే 1,34,205 మంది విద్యార్థులు అర్హత సాధించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. వీరికి ఇంజనీరింగ్ ప్రవేశాలతో పాటు ఇతర జాతీయ స్ధాయి పరీక్షలు కూడా ఉన్నందున ఫలితాలను త్వరగా విడుదల చేశారు. మిగిలిన అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఫలితాలను ఈనెల 14న ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవి కూడా విడుదలైతే మొత్తం ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసినట్లవుతుంది.
ఇవాళ విడుదలైన ఏపీ ఈఏపీసెట్ 2021 పరీక్షా ఫలితాలను ప్రభుత్వం సీఎం జగన్ కు చెందిన సాక్షి పత్రికలో మాత్రమే అందుబాటులో ఉంచారు. education.sakshi.com వెబ్ సైట్లో ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. విద్యార్ధులకు త్వరలో మార్కుల జాబితాలను అందజేస్తారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇందుకు అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలు కూడా విడుదల కావాల్సి ఉంది.
Recommended Video
వాస్తవానికి ఏపీలో ఎంసెట్ పరీక్షకు గత కొంతకాలంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. భారీ ఎత్తున కాలేజీలు ఉన్నప్పటికీ ప్రవేశాలు మాత్రం జరగడం లేదు. కోర్సులకు ఆదరణ కూడా భారీగా తగ్గుతోంది. అదే సమయంలో మెడికల్ కాలేజీల ప్రవేశాల కోసం కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నీట్ పరీక్ష నిర్వహిస్దోంది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కేవలం ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాల కోసం మాత్రం ఎంసెట్ నిర్వహించాల్సిన పరిస్దితి. దీంతో ప్రభుత్వం ఎంసెట్ పేరును కాస్తా ఈఏపీసెట్ గా మార్చేసింది. పేరు మారినా అవే పరీక్షలు కావడంతో విద్యార్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని రాశారు. ఇవాళ ఫలితాల విడుదల చేశారు.