ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల కీలక నిర్ణయం..!!
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్లతో ఈ నెల 8 నుంచి మలిదశ ఉద్యమానికి సిద్ధం అవుతోంది. వచ్చే నెలలో ఉద్యోగుల ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం స్పందించక పోతే చలో విజయవాడ తరహా కార్యక్రమానికి దిగుతామని ప్రకటించింది. రెండో దశ ఆందోళన ఈ నెల 29 వరకు కొనసాగుతుందని జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ సారి ఉద్యమంలో భాగంగా కొత్త తరహా నిరసనలకు సిద్దమయ్యారు.
ఉద్యోగల సంఘాల నిరసనలు: ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్లతో ఈ నెల 8 నుంచి మలిదశ ఉద్యమానికి సిద్ధం అవుతున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం నేతలు స్పష్టం చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి 29 వరకు రెండో దశ ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టనున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు.
ఈ నెల 10 తేదీన నల్ల మాస్కులు ధరించి.. స్పందన కార్యక్రమంలో 26 జిల్లాల్లో కలెక్టర్లకు ఉద్యోగుల డిమాండ్ల పై మెమోరాండం ఇవ్వనున్నారు. 11వ తేదీన ఒక్క రోజు సెల్ ఫోన్లలో ప్రభుత్వ యాప్ల వినియోగాన్ని నిలుపుదల చేయాలని నిర్ణయించింది. 12వ తేదీన 26 జిల్లాల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వారి సమస్యలపై ధర్నాకు నిర్ణయించారు.

వినూత్నం కార్యక్రమాలు..: జేఏసీ తమ నిరసనల్లో భాగంగా వినూత్న కార్యక్రమాలను డిసైడ్ చేసింది. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీన మరణించిన సీపీఎస్, పదవీ విరమణ చెందిన ఉద్యోగుల కుటుంబాల ఇళ్లను సందర్శించాలని నిర్ణయించింది. అదే విధంగా అన్ని కలెక్టరేట్ల వద్ద సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా నిర్వహించేలా డిసైడ్ అయ్యారు.ఈ నెల 20వ తేదీన ప్రతి నెలా జీతాల ఆలస్యానికి నిరసనగా బ్యాంకర్లను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు పేర్కొంది.
ఈఎంఐ చెల్లింపుల పై ఒత్తిడి చేయవద్దని, ఫెనాల్టీలు వేయవద్దని కోరుతూ ప్రధాన బ్యాంకులను కోరనున్నారు. ఈ నెల 27న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లను సందర్శించి ప్రతినెలా ఆలస్యంగా పెన్షన్ వస్తున్నందున వారి సమస్యలపై పరామర్శ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఇతర ఉద్యోగ సంఘాలు తమ పోరాటానికి కలిసి రావాలని బొప్పరాజు కోరారు.
చలో విజయవాడ..: ఉద్యమ కార్యాచరణలో భాగంగా నాలుగు జిల్లాల్లో ప్రాంతీయ సమావేశాలకు నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి తాము ఆశిస్తున్న విధంగా స్పందన రాకపోతే ఛలో విజయవాడ నిర్వహిస్తామని వెల్లడించారు. పే స్కేల్లో జరిగిన మోసం తో ప్రతీ ఉద్యోగికి అన్యాయం జరుగుతోందని బొప్పరాజు చెప్పుకొచ్చారు. పీఆర్సీ అరియర్ నుంచి డీఏ అరియర్లను వేరు చేయాలని కోరామని, 12 పీఆర్సీ కమిషనర్ నియామకం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
కొత్త డీఏ ల గురించి ఆర్థిక శాఖ మాటే ఎత్తటం లేదని వాపోయారు. గ్రామ వార్డు సచివాలయాల్లో తీవ్రమైన పనిభారం ఉంటోందని చెప్పారు. మహిళా రక్షణ కార్యదర్శులను హఠాత్తుగా పోలీసులుగా మార్చేసి బలవంతం చేస్తున్నారని, అసలు వారికి శిక్షణ లేకుండా పోలీసులని ఎలా పిలుస్తారని నిలదీసారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపైన సానుకూలంగా ఉన్నామని చెబుతోంది.












Click it and Unblock the Notifications