ఎక్సైజ్ శాఖకు లిక్కర్ వ్యాపారుల భారీ ఝలక్, వాట్ నెక్స్ట్..!!
ఏపీలో మద్యం వ్యాపారుల తీరు ఆసక్తి కరంగా మారుతోంది. వీరి నిర్ణయాలు ఎక్సైజ్ శాఖకు పరీక్ష గా మారుతున్నాయి. ఏపీ ఎక్సైజ్ శాఖ కొత్త బార్ల పాలసీలో భాగంగా టెండర్లు ఆహ్వానించింది. దరఖాస్తుల సమర్పణకు గడువు సమీపిస్తున్నా నూతన బార్ విధానానికి స్పందన కనిపించటం లేదు. దీంతో, ఎక్సైజ్ అధికారులు టెండర్ దారుల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు టెండర్లు ఆహ్వానిస్తే ఇప్పటి వరకు కేవలం 90 మంది మాత్రమే దరఖాస్తు చేసారు.
ఈ రోజు చివరి రోజు కావటంతో టెండర్ల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
ఏపీలో నూతన బార్ల టెండర్ల దాఖలుకు ఈ రోజు చివరి రోజు. ఈ సాయంత్రం లోగా టెండర్లు దాఖలు చేయాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు లైసెన్స్లు ఇవ్వడానికి నోటిఫికేషన్ జారీచేస్తే.. ఇప్పటి వరకు 57 బార్ లకు 90 దరఖాస్తులే వచ్చాయి. మిగిలిన వాటికి ఒక్కటీ రాలేదు. ఎక్సైజ్ నిబంధనల మేరకు ప్రతీ బార్ కు నాలుగు దరఖాస్తులు వస్తేనే వాటిల్లో లాటరీ తీసి లైసెన్సు దారుని ఎంపిక చేస్తారు. అయితే, దీనిని మద్యం వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఇలా కేవలం 9 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. అయితే, ఎక్సైజ్ శాఖ మాత్రం ఈ రోజు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తోంది.

మొత్తం 1972 మంది ప్రాసెసింగ్ రసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవటంతో పెద్ద సంఖ్య లో దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. అయితే, అసలు ఇంతలా చర్చ జరగటానికి కారణం పాలసీలోని నిబంధనలే నని చెబుతున్నారు. 840 బార్లకు లాటరీ తీయాలంటే మొత్తం 3,360 దరఖాస్తులు రావాలి. అది కూడా ప్రతి బార్కు నాలుగు చొప్పున దరఖాస్తులు అందాలి. ఒకవేళ ఏదైనా బార్కు నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తులు వేస్తే మొత్తం దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరగాలి. తొలి నుంచి బార్లకు ఇచ్చే మద్యంపై అదనపు పన్ను, నాలుగు దరఖాస్తులు తప్పనిసరి అనే నిబంధనలను వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. వారిని ఎక్సైజ్ అధికారులు ఎంత అనునయించినా ముందుకు రావడం లేదు. దీంతో, ఈ సాయంత్రం వరకు పెద్ద సంఖ్యలో దాఖలు అయ్యే అవకాశం ఉందనే అంచనాల వేళ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications