ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ - ఎన్నికల వేళ మెరుగైన ఫలితాలు..!!
ఎన్నికల ఏడాదిలో ఏపీ ఆదాయ వృద్ధి గణనీయంగా పెరిగింది. ఎన్నికల ఏడాదిలో సంక్షేమం అమలుతో పాటుగా కీలక నిర్ణయాల అమలు వేళ ఇది బిగ్ రిలీఫ్. ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు.
గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరు కనబరిచింది. ఆదాయన్ని ఆర్జించే శాఖలతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేసారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాల పైన సుదీర్ఘంగా చర్చించారు.

ఆదాయ వృద్ధిలో మెరుగైన ఫలితాలు: ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంతమేర లక్ష్యాలను చేరుకున్నామో వివిధ శాఖలకు చెందిన అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైనట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఏపీలో ఉందని అధికారులు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే కర్ణాటకలో 27.51శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 25.29శాతం వృద్ధి సాధించింది.
2022-23లో రాష్ట్రంలో వాణిజ్యపన్నుల ఆదాయం రూ. 51,481 కోట్లు. 93.24శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్టుగా అధికారులు వివరించారు.ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) రూ.60,191 కోట్లు లక్ష్యంగా నిర్ణయించారు. లీకేజీలను అరికట్టి, సమగ్ర పర్యవేక్షణలద్వారా లక్ష్యాన్ని చేరుకునే మార్గాలపై దృష్టిపెట్టాలని స్పష్టం చేసారు.
స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ది: యంత్రాంగంలో సరైన విధానాలను అమలు చేయడంద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయన్న సీఎం. వీటిపై దృష్టిపెట్టాలని నిర్దేశించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ది చెందినట్టుగా లెక్కలు స్ప్టం చేస్తున్నాయి.
గత ఐదేళ్లుగా క్రమంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుతూ వస్తోంది. 2018-19లో ఈ శాఖ ఆదాయం రూ.4725 కోట్లు కాగా, 2022-23 నాటికి రూ. 8071కోట్లకు ఆదాయం చేరింది. రిజిస్ట్రేషన్లు, టౌన్ ప్లానింగ్ విభాగాలు, మండల కార్యాలయాలు, గ్రామవార్డు సచివాలయాలు సహా ఇతర చోట్లకూడా ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేసారు.
తగ్గిన లిక్కర్ వినియోగం: 2018-19 తో పోలిస్తే 2022-23లో 12.61శాతం లిక్కర్ వినియోగం తగ్గినట్టుగా తెలిపిన అధికారులు వెల్లడించారు. 2018-19లో 384.3 లక్షల కేసుల లిక్కర్ ను రాష్ట్రంలో వినియోగిస్తే.. 2022-2౩లో 335.9 లక్షల కేసుల లిక్కర్ వినియోగిస్తున్నట్టు వివరించారు. 2018-19లో 277.1 లక్షల కేసుల బీరును వినియోగిస్తే.., 2022-23లో 116.7 లక్షల కేసులు బీరు మాత్రమే వినియోగించినట్టు తేల్చారు.
2018-19తో పోలిస్తే 2022-23లో 57.87శాతం తక్కువగా బీరు వినియోగించినట్టు విశ్లేషించారు. డ్రగ్స్, మత్తుపదార్థాలను నివారించడానికి, వాటి పంపిణీని అడ్డుకోవడానికి అధికారులు గట్టి దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. అవినీతి నిరోధకశాఖను క్రియాశీలకంగా ఉంచాలని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి, ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపై ఏసీబీ నంబర్లను ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా హోర్డింగ్స్ఉంచాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications