Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనలో సర్కార్ యాక్షన్- ఇద్దరు అరెస్ట్..!
ప్రకాశం బ్యారేజ్ గేట్లను మూడు బోట్లు ఢీకొన్న ఘటనపై కూటమి సర్కార్ చర్యలకు దిగింది. గత వారం ప్రకాశం బ్యారేజ్ కు భారీ వరద నేపథ్యంలో గేట్లను మూడు పెద్ద బోట్లు అతి వేగంగా వచ్చి ఢీకున్నాయి. అయితే ఈ మూడు బోట్లూ తాడుతో కట్టేసి ఉండటం, వాటికి వైసీపీ రంగులు కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంలో అనుమానాలు మొదలయ్యాయి. వీటిపై విచారణ జరిపించిన ప్రభుత్వం.. ఇందులో వైసీపీ నేతల కుట్ర ఉందని తేల్చింది.
వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం బంధువుకు అనుచరుడైన వ్యక్తే ఈ బోట్లను ఇలా గొల్లపూడి నుంచి కృష్ణా నదిలోకి వదిలి ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొట్టేలా చేశారని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం దీన్ని కుట్రగా తేల్చేసింది. దీంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరిని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. తలశిల రఘురాంకు బంధువు, అనుచరుడైన కుక్కలగడ్డ ఉషాద్రితో పాటు కోమటిరెడ్డి రామ్మోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ నెల 1న బోట్లు ఢీకొట్టిన ఘటనలో మూడు బ్యారేజ్ గేట్లు ధ్వంసం అయ్యాయి. వీటికి కౌంటర్ వెయిట్లు తిరిగి పెట్టే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఈ బోట్ల యజమానులు ఇప్పటివరకూ వాటిని స్వాధీనం చేసుకునేందుకు రాలేదు. దీంతో ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనిగానే భావిస్తున్న పోలీసులు తదుపరి విచారణకు సిద్దమవుతున్నారు. అరెస్టు చేసిన ఇద్దరినీ రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications