వాలంటీర్లకు ఉగాది పురస్కారాలు- సంఖ్య ఖరారు- ఎంతమందికంటే
ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వద్దకు చేరుస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇచ్చే ఉగాది పురస్కారాలపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ది దారుల సంఖ్యను అధికారులు సీఎం జగన్కు అందించారు. దీనికి ఆయన ఆమోద ముద్ర వేశారు. మూడు కేటగిరీల్లో లబ్ది దారులకు ఈ పురస్కారాలు అందిస్తారు.
ఏపీలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు శ్రమిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఉగాది రోజు పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేరుతో మూడు కేటగిరీల్లో ఈ పురస్కారాలు అందిస్తారు. మండలం, మున్సిపాలిటీ, కార్పోరేషన్ స్ధాయిలో ఈ పురస్కారాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉగాది రోజున వీరికి సీఎం జగన్ చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఎలాంటి ఫిర్యాదులు లేని, ఏడాదికి పైగా సేవలందించిన 2.18 లక్షల మంది వాలంటీర్లకు సేవా మిత్ర పురస్కారాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి రూ.10వేల ప్రోత్సాహకం అందిస్తారు. అలాగే నాలుగు వేల మంది వాలంటీర్లకు సేవా రత్న పురస్కారాలు అందిస్తారు. మండలానికి ఐదుగురు చొప్పన, ప్రతీ మున్సిపాల్టీకి ఐదుగురు చొప్పున, ప్రతీ కార్పోరేషన్కు పది మంది చొప్పున వీరిని ఎంపిక చేస్తారు. వీరికి రూ.20 వేల ప్రోత్సాహకం ఉంటుంది. అలాగే నియోజకవర్గానికి ఐదుగురు చొప్పన 875 మందిని సేవా వజ్రాలుగా ఎంపిక చేస్తారు. వీరికి ఒక్కొక్కరికి రూ.30 వేల నగదు అందిస్తారు. ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, ఇంటివద్దకే రేషన్ పంపిణీ, పెన్షన్ కార్డు, రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుల కార్యక్రమాల్లో చూపిన సమర్ధత ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు.