గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ న్యూస్..! జీవో జారీ..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవాళ ఓ శుభవార్త చెప్పింది. వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ఓ సమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం 10 మంది మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. వీరు చేసే సిఫార్సు ఆధారంగా ఆ సమస్యకు పరిష్కారం చూపబోతోంది. ఈ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. అదే జరిగితే సచివాలయ ఉద్యోగుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడనుంది.
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్ల ఖరారు, ఛానలైజింగ్ కోసం 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పంచాయతీరాజ్, సాంఘిక సంక్షేమ, ఆర్దిక, మున్సిపల్, వైద్యారోగ్య, వ్యవసాయ, హోం, రెవెన్యూ, విద్యుత్, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రులు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్ గా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు వీలుగా మంత్రుల కమిటీ తమ శాఖల్లో తాత్కాలిక పోస్టుల సృష్టిపై చర్చించనుంది. అలాగే ఇతర శాఖల్లో వీరికి ప్రమోషన్లు కల్పించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంది. వేరే శాఖల్లో వీరికి ప్రమోషన్లు కల్పిస్తే వారికి ఇవ్వాల్సిన జీత భత్యాలను ఖరారు చేస్తుంది. ఈ మేరకు ఆయా శాఖలకు సూచనలు చేస్తుంది. ఇలా ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత వారి స్ధానంలో సచివాలయాల్లో ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీకి సూచనలు చేస్తుంది.

మంత్రుల కమిటీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లపై చర్చించి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లపై నిర్ణయం తీసుకుంటుంది. తాజాగా సచివాలయ ఉద్యోగులు ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో వారు చేస్తున్న డిమాండ్లలో ఒకటైన ప్రమోషన్లపై ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన నాటి నుంచి ఉద్యోగులకు ప్రమోషన్లు లభించలేదు.












Click it and Unblock the Notifications