ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్..! జీవో జారీ..!
ఏపీలో కూటమి సర్కార్ ఆర్టీసీ ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించేందుకు వీలుగా ఏర్పాటు చేసే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలకు ఇప్పటివరకూ గుర్తింపు ఉన్న ఉద్యోగ సంఘాల్ని మాత్రమే ఆహ్వానించే వారు. దీంతో ఆర్టీసీలో గుర్తింపు కలిగిన సంఘంగా ఉన్నప్పటికీ ఎంప్లాయీస్ యూనియన్ కు కానీ, మరో సంఘం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ను కానీ ఇందులో చోటు ఉండేది కాదు.
దీంతో ప్రజా రవాణాశాఖలో భాగంగా ఉన్న ఉద్యోగులతో కూడిన ఈ రెండు సంఘాలూ తమను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో చేర్చాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నాయి. తద్వారా రాష్ట్ర స్దాయిలో ఇతర ఉద్యోగ సంఘాలతో పాటు తమ వాణిని కూడా వినిపించేందుకు అవకాశం లభిస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ ఈ రెండు సంఘాలను కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ ప్రజా రవాణాశాఖ ఉద్యోగులతో కూడిన ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రెండింటినీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో చేరుస్తూ సాధారణ పరిపాలనాశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ రెండు సంఘాలు ఇకపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలకు తమ ప్రతినిధుల్ని పంపేందుకు వీలు కలిగింది. దీంతో పాటు వారి సమస్యల్ని రాష్ట్రస్ధాయిలో ఉన్నతాధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకు అవకాశం కలగబోతోంది.

ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ లకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కల్పించడం పట్ల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. 2020లో ఆర్టీసీ విలీనంతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఈయూ గుర్తింపు రద్దు కాగా.. కొత్తగా ఈ రెండు సంఘాలకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. దీంతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యత్వం కోసం ఈయూ చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించినట్లు నేతలు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications