వాలంటీర్లకు శుభవార్త... కీలక ప్రకటన చేసిన చంద్రబాబు ప్రభుత్వం
తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతోపాటు వారికిస్తున్న రూ.5వేల వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో వారికిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఆలస్యమవుతుండటంతో వాలంటీర్లంతా ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం వారికి శుభవార్త వినిపించడమే కాకుండా కీలక ప్రకటన చేసింది.
ప్రకటన చేసిన మంత్రి వీరాంజనేయస్వామి
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా వాలంటీర్లకు సంబంధించిన ప్రశ్నను పంపించారు. దీనిపై సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సమాధానం ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వాలంటీర్ల వేతనాన్ని పెంచబోతున్నట్లు వెల్లడించారు. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే వారికి సంబంధించి మంచి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈ వ్యవస్థను కూడా రాష్ట్రంలో కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

ఆసక్తికరంగా మారిన వాలంటీర్ల విధులు
వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉందని ప్రభుత్వం చెబుతున్న తరుణంలోనే వారి వేతనాలను త్వరలోనే పెంచబోతున్నట్లు చెబుతుండటం ఆసక్తికరంగా మారింది. నిధుల కొరత వెంటాడుతున్న తరుణంలో రూ.10వేల పెంపు అనేది ప్రభుత్వానికి భారంగా మారుతుందా? అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వాలంటీర్లకు రూ.10వేల వేతనం పెంచి, వారి విద్యార్హతలను పరిశీలించి, వీరికి మూడు సంవత్సరాల కాలపరిమితితో మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలు పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ మూడు సంవత్సరాల కాలంలో వీరికి ఎటువంటి విధులు కేటాయిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications