గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! లేటెస్ట్ ఇవే ..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై వారిలో అసంతృప్తి పెరుగుతోంది. ఇప్పటికే ఉద్యోగులు పెండింగ్ సమస్యల విషయంలో అధికారులతో వరుసగా చర్చలు జరుపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా సచివాలయ ఉద్యోగులకు పలు కీలక అంశాలపై స్పష్టత ఇచ్చింది. దీంతో ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
తాజాగా సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయాల జేఏసీ ప్రతినిధులతో ఆ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఇతర అధికారులు చర్చించారు. ఈ చర్చల్లో ప్రధానంగా నోషనల్ ఇంక్రిమెంట్ల జారీ, ఆన్ లైన్ లో సెలవుల దరఖాస్తు, ఇంటింటి సర్వేల నిర్వహణ, పదోన్నతులు, ఉద్యోగులతో నిరంతర చర్చల విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఉద్యోగులు కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టత వచ్చినట్లయింది.

ఇందులో సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ల జారీ విషయంలో ఆర్థికశాఖ అంతర్గతంగా పరిశీలన జరుపుతోందని వారికి అధికారులు తెలిపారు. అది పూర్తి కాగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అలాగే ఉద్యోగులకు సెలవుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ అప్లికేషన్ విధానం తెస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు ఆన్ లైన్ లో సెలవు పెట్టి నిర్ణీత సమయం తర్వాత ఆమోదంతో సంబంధం లేకుండా సెలవు తీసుకోవచ్చని తెలిపారు.

సచివాలయాల్లో హార్డ్ వేర్ అప్ గ్రేడ్ చేసే విషయంలోనూ అధికారుల నుంచి ఉద్యోగుల జేఏసీకి హామీ లభించింది. ఇక వాలంటీర్ తరహాలో ఇంటింటి సర్వేలు చేయడం, పథకాల పంపిణీ విషయంలో మాత్రం ప్రభుత్వం చేసేదేమీ లేదని తేల్చేసింది. ప్రమోషన్ల విషయంలో మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు. అలాగే ఉద్యోగులతో నెల, నెలా 15 రోజులకోసారి చర్చలు జరిపేందుకు మాత్రం అభ్యంతరం లేదని వారికి హామీ ఇచ్చారు. దీంతో ప్రధాన సమస్యల విషయంలో వారికి క్లారిటీ లభించింది.












Click it and Unblock the Notifications