తిరుమల శ్రీవారి బంగారు డాలర్ల దుర్వినియోగం కేసులో ప్రభుత్వ అనూహ్య నిర్ణయం.. కీలక ఉత్తర్వులు!
టిటిడిలో బంగారు డాలర్ల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మంది అధికారుల పైన ప్రభుత్వం చర్యలను నిలిపివేసింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మంది అధికారులు ఊపిరి పీల్చుకోగా, అసలు ఈ కేసులో ఏం జరిగింది అన్న దానిపైన ప్రతి ఒక్కరి ఆసక్తి నెలకొంది.
టిటిడి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ బంగారు డాలర్ల కేసుపై నివేదిక
2006వ సంవత్సరంలో ఐదు గ్రాముల చొప్పున 300 బంగారు డాలర్లు దుర్వినియోగం అయ్యాయని కొంతమంది అధికారులపైన ఆరోపణలు వెల్లువగా మారాయి. అయితే ఈ వ్యవహారం పైన టిటిడి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి 2008లో దర్యాప్తు జరిపి ఒక నివేదికను సమర్పించారు. 15.40 లక్షల రూపాయల విలువైన బంగారు నాణేల దుర్వినియోగానికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని ఆ నివేదిక ద్వారా సిఫార్సు చేశారు.

బంగారు డాలర్ల దుర్వినియోగం కేసులో ప్రభుత్వ శాఖాపరమైన విచారణ
ఆపై 2006లో బంగారు డాలర్ల దుర్వినియోగానికి బాధ్యులైన అధికారులపై అభియోగాలు నమోదు చేసి కేసును సిబిసిఐడి కి అప్పగించారు. ఇక రంగంలోకి దిగిన సిబిసిఐడి ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదికను సమర్పించింది. అటు టిటిడి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి ఇచ్చిన నివేదిక, మరోవైపు సిబిసిఐడి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
బంగారు డాలర్ల కేసులో తదుపరి చర్యలు నిలిపివేసిన ప్రభుత్వం
ఈ బాధ్యతను కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ కు అప్పగించగా మొదటి ఈ కేసును సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సుభ్రేంద్రు భట్టాచార్య, తర్వాత రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జె.సత్యనారాయణ దర్యాప్తు చేశారు. అయితే వీరి విచారణలో 300బంగారు డాలర్ల దుర్వినియోగం పైన అభియోగాలు రుజువు కాలేదని తేలింది. దీంతో అభియోగాలు మోపబడిన వారిపైన తదుపరి చర్యలను నిలిపివేస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి వి వినయ్ చంద్ర ఉత్తర్వులను జారీ చేశారు.
వీరికే ఉపశమనం
తాజా నిర్ణయంతో ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ ఈవోలు, ఏఈవోలు, సూపరింటెండెంట్లు, అసిస్టెంట్లతో పాటు పలువురు ఉపశమనం పొందారు. ఆర్ ఉమాపతి, ఆర్ రఘునాథ చారి, ఎన్ చెంచులక్ష్మి, కే చిత్తరంజన్, ఈ రామచంద్ర రెడ్డి, ఏ రఘురామిరెడ్డి, ఎం చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ గజపతి, కే గోవర్ధన్, బి మల్లికార్జున మూర్తి, ఎం వెంగన్న, ఆంజనేయులు, బిఆర్ గురు రాజారావు, రావినూతల శ్రీరామ్, ఏవి రమణమూర్తి ఉన్నారు.
15 మందికి లభించిన ఊరట
ఇదిలా ఉంటే గతంలో డాలర్ల కేసులో టిటిడి ఆలయ ఓ ఎస్ డి గా పని చేసిన డాలర్ శేషాద్రి పైన కూడా ఆరోపణలు నమోదయ్యాయి. అయితే ఆయన 2021 సంవత్సరంలో మరణించారు. ప్రస్తుతం ఈ కేసులో 15 మందికి ఊరట లభించడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications