AP Garbage Tax: ఏపీలో చెత్త పన్ను వసూళ్లకు బ్రేక్..!
ఏపీలో గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం వసూలు చేసిన చెత్త పన్నుకు చరమగీతం పాడుతూ త్వరలో అధికారం చేపట్టబోతున్న కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం బాధ్యత అయిన చెత్త సేకరణకు ప్రత్యేకంగా పన్ను విధించడంతో పాటు దాన్ని ఐదేళ్ల పాటు ముక్కుపిండి వసూలు చేసిన వైసీపీ సర్కార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో తాము అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు. దీన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టబోతున్న నేపథ్యంలో చెత్త పన్ను వసూళ్లను నిలిపేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కింది స్థాయి సిబ్బందికి మౌఖికంగా ఆదేశాలు పంపారు. దీంతో సిబ్బంది కూడా చెత్త పన్ను వసూళ్లను నిలిపేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో లక్షలాది మందికి ఊరట లభించినట్లయింది. ఐదేళ్ల పాటు మున్సిపల్ సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ వసూల్లు చేసిన చెత్త పన్ను రద్దుపై ప్రభుత్వం త్వరలో అధికారికంగా ఆదేశాలు జారీ చేయనుంది.

గత వైసీపీ ప్రభుత్వం ఉచిత పథకాల డోసు పెంచేయడంతో రాష్ట్ర ఖజనాలో డబ్బులు సరిపోని పరిస్ధితి. దీంతో ఆదాయ మార్గాల్ని వెతికిన ప్రభుత్వం.. చివరికి చెత్త పన్ను పేరుతో కొత్త పన్నును తీసుకొచ్చింది. ఇళ్లకు 30 రూపాయల నుంచి మొదలుపెట్టి ఆస్పత్రులకు వేలల్లో చెత్త పన్ను బిల్లులు పంపింది. అలాగే వీటిని తప్పనిసరిగా వసూలు చేయాల్సిందేనని మున్సిపల్ సిబ్బందికి టార్గెట్లు కూడా పెట్టింది. దీంతో జనాగ్రహం వ్యక్తమైంది. ఇది తెలిసీ కొనసాగించింది. చివరికి ప్రభుత్వం మారడంతో చెత్త పన్ను రద్దయింది.












Click it and Unblock the Notifications