కేంద్రం సై- జగన్ సర్కార్ నై...ఆన్ లైన్ క్లాసులపై తలోమాట- విద్యార్దులకు చుక్కలు...
కరోనా నేపథ్యంలో పాఠశాలలన్నీ నాలుగు నెలలుగా మూతపడే ఉన్నాయి. ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. కరోనా తగ్గే వరకూ స్కూళ్లు తెరిచే పరిస్దితి లేనందున ఆన్ లైన్ క్లాసులను ప్రోత్సహించాలని కేంద్రం ఎప్పుడో చెప్పింది. కానీ ఈ ఆదేశాల అమలులో జగన్ సర్కారు మాత్రం తీవ్ర గందరగోళానికి లోనవుతోంది. ప్రభుత్వ స్కూళ్లకు ఓ రకంగా, ప్రైవేటు స్కూళ్లకు మరో రకంగా ఆదేశాలు ఇస్తూ జనాన్ని మరింత గందరగోళంలోకి నెడుతోంది. దీంతో విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సిన సమయంలో ఇప్పటికే విద్యార్ధులు కనీసం ఆటపాటలూ లేక, చదువులూ లేక ఉసూరుమంటున్నారు.
కరోనా-ఆన్ లైన్ చదువులు..
కరోనా కారణంగా విద్యార్ధులు స్కూళ్లకు వెళ్లలేని పరిస్ధితి ఉండటంతో ఆన్ లైన్ క్లాసులతో డిస్టెన్స్ లెర్నింగ్ కు అవకాశం ఇవ్వాని కేంద్రం రాష్ట్రాలకు గతంలో సూచించింది. దీని ప్రకారం పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆన్ లైన్ విధానంలోకి మారిపోయాయి. ప్రభుత్వం, ప్రైవేటు అన్న తేడా లేకుండా అన్ని స్కూళ్లూ ఇప్పుడు ఆన్ లైన్ పేరు జపిస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం పరిస్ధితి విచిత్రంగా కనిపిస్తోంది. కేంద్రం ఇచ్చిన ఆన్ లైన్ ఆదేశాలను పాటించడంలో సర్కారు తీవ్ర గందరగోళానికి లోనవుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా తగ్గే వరకూ ఆన్ లైన్ విధానం కొనసాగుతుందని ఓ స్పష్టమైన ప్రకటన కూడా ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేకపోయింది.
ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకూ తేడా...
కేంద్రం ఆదేశాలను రాష్ట్రంలోని విద్యాసంస్ధలన్నింటికీ ఒకేలా వర్తింపజేయాల్సింది పోయి ప్రభుత్వ స్కూళ్లకు ఓ విధంగా, ప్రైవేటు స్కూళ్లకు మరో విధంగా వర్తింపచేస్తున్న పరిస్ధితి ఏపీలో కనిపిస్తోంది. ప్రైవేటు స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసులను నిషేధిస్తూ రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులు ఇస్తున్న కఠిన ఆదేశాలతో ఇప్పటికే వాటి బోధన ఆగిపోయింది. కానీ తాజాగా ప్రభుత్వ స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసులు ప్రోత్సహించాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరో ఆదేశం జారీ చేశారు. దీంతో త్వరలో ఆన్ లైన్ క్లాసులకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ప్రైవేటు స్కూళ్లకు మాత్రం ఆన్ లైన్ వద్దు, ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే అది పరిమితం అన్న సంకేతాలను ప్రభుత్వం ఎందుకిస్తోందన్న చర్చ సాగుతోంది.
ఇప్పటికే ప్రైవేటుకు చుక్కలు...
ఇప్పటికే ఏపీలో ఫీజుల నియంత్రణ, నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహించకుండా వారిని అడ్డుకుంటోంది. విద్యాసంవత్సరం ప్రారంభం అయితే అందరికీ ఒకేసారి స్కూళ్లు ప్రారంభం కావాలి, విద్య కూడా అందాలి. అది ఆన్ లైన్ క్లాసు అయినా సరే ప్రభుత్వ, ప్రైవేటు తేడా లేకుండా ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ స్కూళ్లను ప్రోత్సహిస్తూ ప్రైవేటును పూర్తిగా కట్టడి చేయాలని భావించడం చూస్తుంటే ప్రైవేటు రంగంపై కక్ష గట్టినట్టే కనిపిస్తోంది. దీంతో ఇప్పటివరకూ వసతులు, నాణ్యత లేని ప్రభుత్వ స్కూళ్లను కాదని ప్రైవేటు స్కూళ్లలోనే విద్యార్ధులను చదివిస్తున్న తల్లితండ్రులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
Recommended Video
ప్రభుత్వ బాటలోనే ప్రైవేటు...
ప్రభుత్వం ప్రస్తుతం దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధనకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్ధలు కూడా దూరవిద్యా బోధనను మాత్రమే చేపట్టాలని విద్యాశాఖ తాజా ఆదేశాలు ఇచ్చింది. స్మార్ట్ ఫోన్లు, మెసేజ్ లు, సోషల్ మీడియా, రేడియో, టీవీల ద్వారా మాత్రమే క్లాసులు ఉండాలంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించరాదని, ర్యాంకులు ఇవ్వొద్దని కూడా విద్యాశాఖ సూచించింది. కరోనా తగ్గి స్కూళ్లు తిరిగి ప్రారంభం అయ్యే వరకూ ఇదే విధానం పాటించాలని ప్రైవేటు స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది.