ఏపీలో ఉద్యోగార్ధులకు భరోసా- ఇక స్కిల్ కాలేజీలు.. అక్టోబర్ నుంచి 30 చోట్ల...
ఏపీలో నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే కోర్సులను ఎంపిక చేసి వీటిని నేర్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 30 నగరాల్లో స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని 30 నగరాలు, పట్టణాల్లో స్కిల్ కాలేజీలు ప్రారంభించనుంది.
అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున కడప, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, ఏలూరుతో పాటు పలు చోట్ల స్కిల్ కాలేజీలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. కచ్చితంగా అనుకున్న సమయానికి ఇవి ప్రారంభం కావాలని సీఎం జగన్ టార్గెట్ ఇచ్చారు. ఈ 30 కాలేజీలపై పర్యవేక్షణకు ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. ఆయా కాలేజీల డిజైన్లు, లే అవుట్లకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వీటికి ఒడిశాలోని భువనేశ్వర్ లో సెంచురియన్ స్కిల్ యూనివర్సిటీ తరహా ప్రమాణాలు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకోసం ప్రత్యేక ఆర్కిటెక్ట్ లను నియమిస్తారు.
Recommended Video
వివిధ కంపెనీల నుంచి సీఎస్ఆర్ నిధులు సేకరించడంతో పాటు స్కిల్ కోర్సులు, పాఠ్యప్రణాళికను అత్యున్నత స్ధాయి నిపుణుల ఆమోదం తీసుకుని నిర్ణయిస్తారు. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే 20 కోర్సులను తీసుకుని వీటిపై ఓ హైలెవల్ కమిటీతో అధ్యయనం చేయిస్తారు. నైపుణ్యాభివృద్ధి శాఖ త్వరలో యాప్ ద్వారా ఈ సర్వే చేపట్టబోతోంది. ఇందులో గుర్తించిన కోర్సులను స్కిల్ కాలేజీల్లో అందుబాటులోకి తెస్తారు.