రోడ్లపై పశువులు,కుక్కలను వదిలేస్తే జరిమానా ! ఏపీ సర్కార్ వార్నింగ్..
రోడ్లపై పశువులు, కుక్కల్ని విచ్చలవిడిగా వదిలేయడం వల్ల వాహనదారులకు సమస్యలు తప్పడం లేదు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ఇలా పశువులు, కుక్కలు రోడ్లపైకి రావడం వల్ల ఆఫీసులకు, ఇతరత్రా పనుల కోసం బిజీగా వెళ్లే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వీటిపై స్పందించింది.
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రోడ్లపై పశువులు,పెంపుడు కుక్కలను ఇష్టారాజ్యంగా వదిలేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. పట్టణప్రాంతాల్లో ఇలా వదిలేయడం వల్ల వాహనదారులు,పాదచారులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు గుర్తించింది. ఇలా పెంపుడు జంతువులను రోడ్లపైకి వదలకుండా యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి నారాయణ ఇవాళ సూచించారు. అలాగే రోడ్లపై సంచరించే పశువులు,పెంపుడు కుక్కలను మున్సిపాలిటీకి తరలించి యజమానులకు తగిన జరిమానా వేస్తామని కూడా మున్సిపల్ మంత్రి నారాయణ హెచ్చరించారు.

రోడ్లపైకి రాత్రీ పగలూ తిరుగుతున్న పశువులు, కుక్కల వల్ల సమస్యలు తలెత్తుతున్నట్లు ఇప్పటికే మున్సిపాలిటీలకు పలు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై వాహనదారులు, పాదచారులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వీటి కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ముందుగా ఆయా పశువులు, కుక్కల యజమానులకు సూచనలు చేసి అప్పటికీ వినకపోతే జరిమానాలు విధించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications