విచక్షణాధికారాన్ని వాడిన ఏపీ గవర్నర్- ఈసారి మానవత్వ కోణంలో..
ఏపీని కరోనా మహమ్మారి పీడిస్తున్న వేళ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన విచక్షణాధికారాన్ని వాడి మరీ తీసుకున్న ఈ నిర్ణయంతో వందలాది మంది కరోనా వైరస్ రోగులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే పీఎం కేర్స్ నిధికి తన నెల జీతంలో 30 శాతం తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖ రాసిన హరిచందన్,.. తన తాజా నిర్ణయంతో మానవత్వం చాటుకున్నారని ప్రశంసలు వెల్లువెత్తాయి.

పరిమళించిన మానవత్వం..
కరోనా రక్కసి మానవాళిని పట్టి పీడిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరూ ఉదారంగా స్పందించి నిధులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇలాంటి పరిస్దితుల్లో తన వంతు సాయంగా పీఎం కేర్స్ నిధికి ఏడాది పాటు నెల జీతంలో 30 శాతం ఇచ్చేందుకు సిద్ధమైన ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి అసాధారణంగా రాజ్ భవన్ బడ్జెట్ నుంచి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని గవర్నర్ నిర్ణయించారు.

విచక్షణాధికారం సద్వినియోగం...
ఏపీలో కొంతకాలంగా నెలకొన్న రాజకీయ పరిస్దితుల్లో విచక్షణాధికారం అనే పదం వివాదస్పదంగానూ, ఓ బ్రహ్మపదార్ధంగానూ మారిపోయింది. కానీ ఏపీ గవర్నర్ హరిచందన్ తన విచక్షణాధికారాన్ని వాడి రాజ్ భవన్ బడ్జెట్ నిధులను కరోనా వైరస్ సహాయం కోసం వాడారంటే ఆశ్చర్యం కలుగకమానదు. రాష్ట్ర ప్రధమ పౌరునిగా తనకున్న విచక్షణ అధికారాలకు సద్వినియోగ పరుస్తూ , 30 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా సమకూర్చారు. రాజ్ భవన్ బడ్జెట్ కు సంబంధించి నిధుల వినియోగంలో గవర్నర్ కు విశేష విచక్షణ అధికారాలు ఉంటాయి. ఈ మేరకు గవర్నర్ తరుపున రాజ్ భవన్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలను చేపడుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలకు అర్ధిక పరమైన వెసులుబాటు కోసం రాష్ట్ర రాజ్యాంగ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారు. చర్యకు ఉపక్రమించారు.
Recommended Video

ఆ మేరకు రాజ్ భవన్ లో పొదుపు చర్యలు..
ముప్పై లక్షల రూపాయలను ముఖ్య మంత్రి సహాయ నిధికి సమకూర్చిన నేపథ్యంలో ఆమేరకు రాజ్ భవన్ లో పొదుపు చర్యలు తీసుకోవాలని తన కార్యదర్శి ముకేష్ కుమార్ మీనాను గవర్నర్ హరిచందన్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల రాజ్ భవన్ లకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని, స్వయంగా తన ఖర్చులను తగ్గించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి నిధులు సమకూర్చడం స్ఫూర్తి నిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications