ఏపీలో ఇద్దరు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం-ఉత్తర్వుల జారీ..
ఏపీలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు నియామకం జరిగింది. ఈ నెల 20తో రాష్ట్ర శాసనమండలిలో ఇద్దరు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియబోతోంది. దీంతో వైసీపీ ప్రభుత్వ సిఫార్సు మేరకు ఇద్దరు కొత్త అభ్యర్ధుల్ని ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరు అభ్యర్ధులు ఎమ్మెల్సీలుగా నియామకం కావడం లాంఛనమే.
ఏపీలో గవర్నరు కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యుల స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మరియు ప్రభుత్వ ఎక్స్అఫిషియో ప్రిన్సిఫల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా ఇవాళ ఉత్తర్వులను జారీ చేశారు. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ చే నామినేట్ చేయబడిన కర్రి పద్మ శ్రీ, కుంభా రవిబాబులను ఆ ఖాళీ స్థానాల్లో శాసన మండలి సభ్యులుగా నియమిస్తూ జి.ఓ.ఎం.ఎస్.87ను జారీ చేశారు.

గతంలో గవర్నరు కోటాలో శాసన మండలి సభ్యులుగా నియమించబడిన చదిపిరాళ్ల శివనాథ రెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్ పదవీ కాలం గత నెల 20వ తేదీతో ముగిసిన నేపథ్యంలో ఆ ఖాళీ స్థానాల్లో కొత్తగా వీరిద్దరినీ నియమిస్తూ ఈ ఉత్తర్వులను చేసినట్లు ఓ ప్రకటన వెలువడింది. త్వరలో వీరిద్దరినీ శాసనమండలి ఛైర్మన్ తన ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీంతో వీరిద్దరూ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపడతారు.

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో భారీ మెజార్టీతో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్.. గతంలో మూడు రాజధానుల బిల్లు ఆమోదించలేదనే కారణంతో మండలి రద్దుకు కేంద్రానికి సిఫార్సు చేసింది. కానీ ఆ తర్వాత మారిన పరిణామాల్లో మండలిలో వైసీపీ బలం అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఇప్పుడు మండలిలోనూ మూడొంతులు మెజారిటీతో వైసీపీ బలమైన పక్షంగా ఉది. ఇప్పుడు ఇద్దరు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంతో వైసీపీ బలం మరింత పెరగబోతోంది.












Click it and Unblock the Notifications