రాజధానిపై మరో కీలక నిర్ణయం: ఆరుగురు సభ్యులకు బాధ్యతలు: వారి సిఫార్సులతోనే ముందడుగు..!!
ఏపీ రాజధాని తో పాటుగా నగరాల అభివృద్ది కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాజధాని గురించి గత ప్రభుత్వ ప్రణాళికలను పక్కన పెట్టిన ప్రభుత్వం..అమరావతిని రాజధానిగా కొనసాగింపు పైన మంత్రులు తలో రకంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రాజధాని అంశం మీద స్పందించలేదు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అనే చర్చల నడుమ ఏపీ ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర సమగ్రాభివృద్ది కోసం సలహాలు..సూచనలతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచిస్తూ ఆరుగురు నిపుణులకు బాధ్యతలు అప్పగించింది.
ఇతర నగరాల అభివృద్ది కోసం కమిటీ ఏర్పాటు చేస్తే పెద్దగా చర్చకు ఆస్కారం లేదు. కానీ, ఇప్పుడు అందులో రాజధాని అభివృద్దికి కోసం అని చెబుతూనే ఎక్కడా అమరావతి అనే పేరు మాత్రం ప్రస్తావించలేదు. ఇదే సమయంలో వరద నీటి యాజమాన్యం గురించి నివేదించాలని సూచించారు. దీని ద్వారా ప్రభుత్వం అసలు రాజధాని విషయంలో ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
సమగ్రాభివృద్దికి ఆరుగురితో కమిటీ..
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. రాజధానితో పాటుగా నగరాల అభివృద్ది కోసం సూచనలు..సలహాలు ఇవ్వాలంటూ ఆరుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఏపీ సమగ్రాభివృద్ది కోసం కమిటీ అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో చెబుతూనే..రాజధాని సహా అనే అంశాన్ని జోడించింది. రాజధాని గురించి మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యల తరువాత అమరావతి రాజధానిగా ఉంటుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. దీని మీద మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటి వరకు ఈ అంశం మీద ఎక్కడా మాట్లాడలేదు. ఇక, ఇప్పుడు అమరావతి అనే పేరు ఎక్కడా ప్రస్తావించకుండా రాజధాని అభివృద్ది పైనా సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఇదే ఉత్తర్వుల్లో మరో కీలక అంశం పైన ప్రభుత్వం సమాచారం కోరింది. వరద నీటి యాజమాన్యం పైనా నిపుణుల సలహాలు నివేదికలో పొందు పర్చాలని సూచించింది. దీని ద్వారా ఈ కమిటీ చేసే సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. కమిటీ అమరావతి ప్రాంతంలో అభివృద్దికి ఉన్న అవకాశాలు..ముంపు సమస్య పైన సూచనలు చేయనుంది. అక్కడ భవిష్యత్ నిర్మాణాలకు వీలుగా ఇబ్బంది లేదనే అనుకూల నివేదిక వస్తే ముందుకు వెళ్లటం లేదా నిపుణుల కమిటీ సూచనలు వ్యతిరేకంగా ఉంటే రాజధానిలో నిర్మాణాల గురించి మరో నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది.

ఆరు వారాల గడువు..నివేదిక ఆధారంగానే ముందుకు
రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సమగ్రాభివృద్ది కోసమని కమిటీ ఏర్పాటు చేసినా..ఆ కమిటీ రాజధాని మీద చేసే సిఫార్సులు కీలకం కానున్నాయి. పురపాలక రంగం.. నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న నిపుణులకే ఏపీ ప్రభుత్వం ఈ కమిటీలో స్థానం కల్పించింది. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కన్వీనర్గా వ్యవహరించే ఈ కమిటీలో ప్రొఫెసర్ మహావీర్, అంజలీ మోహన్, శివానందస్వామి, కేటీ రవీంద్రన్, డాక్టర్ అరుణాచలం సభ్యులుగా ఉంటారు. వీరంతా పట్టణాభివృద్ది రంగంలో నిపుణులే.ఇవ్వనుంది. దీంతోపాటు పర్యావరణం, వరదల నియంత్రణలో నిపుణులైన వారిని కమిటీలో కో ఆప్షన్ సభ్యుడిగా నియమించుకోవచ్చని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రత్యేకంగా ఈ అంశం ప్రస్తావించటం ద్వారా ప్రభుత్వం అమరావతి పైన బొత్సా వ్యక్తం చేసిన అభిప్రాయలతో ఏకీభవిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వీటి పైన నిపుణుల సూచనలు కోరటం ద్వారా.. వారు చెప్పే అంశాలు కీలకంగా మారనున్నాయి. కమిటీ సిఫార్సుల కోసం ఆరు వారాల గడువు కేటాయించారు. అదే సమయంలో పాలనా వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్న సమయంలో ఇతర పట్టణాల్లో చేపట్టే అభివృద్ది పైన సిఫార్సులు చేయనున్నారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం ఈ కమిటీ ఏర్పాటు వెనుక రాజధాని లో నిర్మాణాల కొనసాగింపు..అదే సమయంలో అక్కడ పర్యవరణ..వరద నీటి నియంత్రణ గురించి సందేహాల పరిష్కారం కోసమే కమిటీ ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా అమరావతి రాజధానిగా కొనసాగింపు..భవిష్యత్ నిర్మాణాల పైన ఈ కమిటీ చేసే రికమండేషన్స్ కీలకం కానున్నాయి.












Click it and Unblock the Notifications