అన్ని ఆస్పత్రుల్లోనూ ఈహెచ్ఎస్ : ఉద్యోగ సంఘాలతో చర్చలు - బకాయిలపైనా..!!
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ అన్ని ఆస్పత్రుల్లోనూ ఈహెచ్ఎస్ అనుమతిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించినట్లే ఈహెచ్ఎస్ చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలతో చర్చల సమయంలో మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసింది. పీఆర్సీ పెండింగ్ అంశాల పైన ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ చర్చించింది. ఆర్దికేతర అంశాల పైన మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించింది. ఆర్దిక అంశాల పైన సీఎంతో చర్చించి స్పష్టత ఇస్తామని చెప్పింది.

సమస్యలకే పరిమితం కండి
ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల పైన కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారని..కేవలం ఉద్యోగుల సమస్యలకే పరిమితం కావాలంటూ సమావేశంలో కమిటీ సూచించినట్లుగా సమాచారం. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు అన్ని విభాగాలకు వర్తింప చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. జీపీఎఫ్, పీఎఫ్ రుణాలను సకాలంలో ఇవ్వాలని విన్నవించారు. కొత్త జిల్లాలకు పాత జిల్లాల హెచ్ఆర్ఏ వర్తింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరించాలని సంఘాల నేతలు కోరారు.

15 రోజులకోసారి సమావేశం
కోవిడ్ వల్ల మరణించిన ఉద్యోగుల కుటుంబీకులకు సత్వరమే కారుణ్య నియామకం, క్యాడర్వారీగా పే స్కేళ్ల ఫిక్సేషన్ వంటి అంశాల పైన ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యగ సంఘాల నేతలు ప్రస్తావించారు. గతంలో జరిగిన ఒప్పందం మేరకు పీఆర్సీ..డీఏ బకాయిల చెల్లింపు పైన స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ఆర్థికేతర అంశాలపై 15 రోజులకోసారి చర్చించి, ఆర్థిక అంశాలపై సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని ప్రభుత్వ కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. కొత్త జిల్లాలకు 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిపాదించారు. ఈహెచ్ఎస్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామని ప్రభుత్వ కమిటీ హామీ ఇచ్చింది.

నెలాఖరులోగా జీపీఎఫ్ బకాయిలు
క్రమశిక్షణ చర్యల పేరుతో ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరినట్లుగా రెవిన్యూ సంఘాల ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు చెప్పుకొచ్చారు. సాంకేతిక కారణాలతోనే జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు మాయమైందని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారన్నారు. ఈనెలాఖరుకు జీపీఎఫ్ మొత్తాలను ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారని వివరించారు.ఆర్టీసీ సిబ్బందికి సవరించిన పేస్కేల్స్ ఇవ్వాలని కోరామని చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు అందించే ఈహెచ్ఎస్ లో ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న అన్ని ప్రొసీజర్స్ను అమలు చేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది. సీపీఎస్ అంశంపైన సంబంధిత సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications