సంక్షేమ పథకాలపై కూటమి ప్రభుత్వం తాజా నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ తో పాలన చేస్తున్న ప్రభుత్వం..తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్ వైపు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా కీలక శాఖలతో సమీక్షలు నిర్వహిస్తోంది. వచ్చే నెలాఖరులో బడ్జెట్ ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాల అమలు దిశగానూ తాజాగా కూటమి నేతలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
బడ్జెట్ కసరత్తు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటి వరకూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మాత్రమే ప్రవేశ పెట్టిన ప్రభుత్వం ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని యోచిస్తుంది. ఇందుకోసం కసరత్తులు ప్రారంభించింది. సెప్టంబరు నెలలో ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశముందని చెబుతున్నారు. 19వ తేదీ నుంచి... ఈ నెల 19వ నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు జరపనుంది.

పథకాల అమలుపై
ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని ఇప్పటికే అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు ఈ పూర్తి స్థాయి బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశముంది. ఓట్ ఆన్ ఎకౌంట్ లో సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపు చేయలేదు. ఈ సారి బడ్జెట్ లో ప్రభుత్వం అమలు చేయాల్సి ఉన్న పథకాలకు నిధుల కేటాయింపు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెన్షన్ రూ 4 వేలకు పెంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. దసరా నుంచి మరో రెండు పథకాలను ప్రారంభించాలని భావిస్తోంది.
దశల వారీగా
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల అమలు దిశగా కసరత్తు సాగుతోంది. ఈ రెండు పథకాలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు ఈ సారి ప్రతిపాదిస్తారని సమాచారం. ఇక, వచ్చే సంక్రాంతి వేళ అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అమ్మకు వందనం, మహిళలకు రూ 1500 జమ వంటి నిర్ణయాలు మాత్రం వచ్చే ఆర్దిక సంవత్సరం నుంచి అమలు చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications