సీఎం జగన్ గుడ్ న్యూస్ - త్వరలో మూడు లక్షల ఉద్యోగాలు : పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు..!!
ఏపీలో త్వరలోనే భారీగా ఉపాధి కల్పన జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ ఏపీలో పెట్టుబడులు - ఉద్యోగాల కల్పన పైన ఫోకస్ పెట్టారు. త్వరలోనే రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా ఉద్యోగ కల్పన దిశగా అడుగులు పడుతున్నాయి.. ఏపీలో పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు, పరిశ్రమలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. ఏది చేయగలుగుతామో అదే చెబుతున్నామని వివరించారు.
ఏపీలో పారిశ్రామిక దిగ్గజాలు
ప్రభుత్వం చేసే పనుల్లో నిజాయితీ ఉంది కాబట్టే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పారిశ్రామిక దిగ్గజ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. భజాంకాలు, బంగర్లు, సింఘ్వీలు, బిర్లాలు లాంటి వారంతా రాష్ట్రానికి వస్తున్నారన్నారు. అదానీ కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 92 పరిశ్రమలు ఆసక్తి చూపిస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీని ద్వారా 2,19,766 కోట్ల పెట్టుబడులో పాటుగా.. 3,19,829 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
మౌళిక వసతుల పై ఫోకస్
పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో నీరు, విద్యుత్, రోడ్లు, రైల్వే లైన్లకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా విశాఖపట్నంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతున్నామని చెప్పారు. అదానీ కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారని, తమ ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధితో అడుగులు ముందుకేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా పెద్ద మొత్తంలో ఉపాధి లభిస్తుందన్నారు.
గ్రీన్ ఎనర్జీ ద్వారా ఉపాధి
గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టుల కారణంగా సుమారు 30 వేలమందికిపైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. ఎంఎస్ఎంఈలకు చేదోడుగా నిలవాలని స్పష్టం చేసారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు వారికి సకాలంలో అందేలా చూడాలని నిర్దేశించారు. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు కాలుష్య నివారణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.