జగన్ సర్కార్ దూకుడు: ఇంగ్లీష్ మీడియంపై ఇంటింటి సర్వే: గ్రామ కార్యదర్శులకు కొత్త టాస్క్..
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో విద్యాబోధనపై ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏ మీడియంలో విద్యాబోధనను కొనసాగించాలనే విషయంపై ఇంటింటి సర్వే చేపట్టబోతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏ మీడియంలో బోధనను కొనసాగించాలనే విషయాన్ని తల్లిదండ్రుల మీదే వదిలేయాలని, వారు ఎంచుకున్న భాషలో విద్యాబోధన కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం అదే దిశలో చర్యలను చేపట్టింది.
గ్రామ కార్యదర్శులకు బాధ్యత..
ఇంటింటి సర్వే బాధ్యతను గ్రామ కార్యదర్శులకు అప్పగించింది ప్రభుత్వం. జిల్లా, మండల స్థాయి విద్యాశాఖాధికారులు దీన్ని పర్యవేక్షించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల ముఖ్య కార్యదర్శి బీ రాజశేఖర్ ఉత్తర్వులను జారీ చేశారు. దీనికోసం ప్రత్యేక ఫార్మట్ను రూపొందించబోతోంది. ఈ ఫార్మట్ రూపుదిద్దుకున్న వెంటనే వాటిని అన్ని జిల్లా, మండల విద్యాశాఖాధికారులకు అందజేస్తారు. అనంతరం వాటిని గ్రామ కార్యదర్శులకు అందజేస్తారు.
పేరెంట్స్ కమిటీలకూ
ఇదివరకే పాఠశాల స్థాయిల్లో ఏర్పాటు చేసిన పేరెంట్స్ కమిటీలను కూడా ఈ సర్వేలో భాగస్వామ్యులను చేయనున్నారు. గ్రామ కార్యదర్శులతో పాటు పేరెంట్స్ కమిటీలు కూడా ఇంటింటి సర్వేలో పాల్గొనాల్సి ఉంటుందని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ సర్వేను పూర్తి చేయాల్సి ఉంటుందని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో విద్యాబోధనను ఆరంభించి తీరాల్సి ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్టయింది.
అదే నివేదిక సుప్రీంకోర్టుకు..
ఇంటింటి సర్వే ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి సేకరించిన అభిప్రాయాలను నివేదిక రూపంలో దేశ అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించనుంది ప్రభుత్వం. ఇంటింటి సర్వే పూర్తయిన వెంటనే ఈ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయనుంది. దీనికోసం వచ్చేనెల మొదటి వారంలో సుప్రీంకోర్టులో ఓ స్పెషల్ లీవ్ పిటీషన్ను వేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకుంది. ఈ లీవ్ పిటీషన్ విచారణకు వచ్చే సమయానికి సర్వే పూర్తి చేసేలా సన్నాహాలను ఆరంభించింది.
జీవోలను కొట్టేసిన నేపథ్యంలో..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో విద్యా బోధనను కొనసాగించడానికి ఉద్దేశించిన రెండు జీవోలను సవాల్ చేస్తూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సుధీష్ రాంభొట్ల రిట్ పిటీషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కొద్దిరోజుల కిందటే ఈ రెండు జీవోలను కొట్టేసింది. దీనితో ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఏ భాషలో విద్యాబోధన కొనసాగించాలనే విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రుల మీదే వదిలేయాలని సూచించడంతో.. ప్రభుత్వం.. ఈ ఇంటింటి సర్వే చేపట్టింది.
Recommended Video