ఏపీలో కొత్త వ్యవస్థ: వారం రోజులు ముందుగానే తుఫాన్ల సమాచారం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
కృష్ణానది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయం ఇప్పటికే నిండింది. అధికారులు గేట్లను ఎత్తారు. వరద నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు. అటు నాగార్జున సాగర్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవలే సాగర్ గేట్లన్నింటినీ ఎత్తారు అధికారులు.

దీని ప్రభావం ప్రకాశం బ్యరేజీపై పడింది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.92 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. వచ్చిన వరద నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తోన్నారు. అటు గోదావరి సైతం ఉరకలు వేస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.2 అడుగులు.
ఇటువంటి సమాచారం మొత్తాన్నీ ముందస్తుగానే పసిగట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఓ సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అదే- Andhra Pradesh Weather Forecasting and Early Warning Research Centre. క్లుప్తంగా అవేర్ 2.0 అని పిలుస్తారు. వాతావరణంపై ముందస్తు అంచనాలు, విపత్తు నిర్వహణ, రిజర్వాయర్లల్లో నీటి నిల్వలు వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
భారీ వర్షాలు, పిడుగులు, తుఫాన్ల వంటి విపత్తుల గురించి వారం రోజులు ముందుగానే తెలుసుకోవడానికి సాధ్యపడుతుందీ వ్యవస్థ ద్వారా. విపత్తులకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించడం వల్ల ప్రజలను అప్రమత్తం చేయడానికి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే వెసలుబాటు లభిస్తుంది.
దీన్ని ఆర్టీజీఎస్ ఏర్పాటు చేసింది. నదులు, జలశయాల్లో నీటి నిల్వలు, భూమిలో తేమ, గాలి నాణ్యత, కాలుష్యం, భూగర్భ జలాలు.. ఇలా వేర్వేరు అంశాలను పర్యవేక్షించేలా, ప్రజలకు వేగంగా సమాచారాన్ని అందించేలా 'అవేర్ 2.0'ను రూపొందించినట్టు ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.
అవేర్ 2.0తో విపత్తు నష్టాలను తగ్గించి, మరణాలను నివారించే అవకాశం ఉంటుందని ఆర్టీజీఎస్ చెబుతోంది. కచ్చితమైన ముందస్తు సమాచారం ఆధారంగా విపత్తుల సమయాల్లో రైతుల పంటల నిర్వహణ, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయవచ్చని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications