ఏపీలో టెన్త్ పరీక్షలు ఇక ఈజీ: విప్లవాత్మకం: ఆరు పేపర్లే: ప్రశ్నలు కుదింపు..పరీక్షా సమయం పెంపు
అమరావతి: ఉన్నత విద్యావకాశాలకు తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షల విధానంలో జగన్ సర్కార్ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. పరీక్షలు రాయడాన్ని సులభతరం చేసింది. ఆరు పేపర్లకు మాత్రమే విద్యార్థులు పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టింది. రెండో పేపర్ అంటూ ఇక ఉండదు. ఈ మార్పులను ప్రస్తుత విద్యాసంవత్సరానికి మాత్రమే పరిమితం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాత విధానంలోనే పరీక్షలను నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బీ రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Recommended Video
లాక్డౌన్ వల్ల పాఠశాలలకు వెళ్లలేక..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ విధించడం వల్ల విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేకపోయారు. మార్చి 19వ తేదీన మూత పడిన పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు ఇప్పటికీ తెరచుకోలేదు. ఫలితంగా విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పాఠాలను నేర్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులపై ఒత్తిడి పడకుండా పరీక్షల్లో మార్పులు చేసింది. ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు రాయడాన్ని పరిమితం చేసింది.
పరీక్షా సమయం.. ప్రశ్నల సంఖ్య కుదింపు..
విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండటానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రశ్నల సంఖ్యను తగ్గించింది. సాధారణంగా పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది. ఈ సారి ఒక పేపర్కు మాత్రమే పరీక్షలను పరిమితం చేసింది. ఫలితంగా- ప్రశ్నల సంఖ్య గణనీయంగా తగ్గింది. మొత్తం 360 ప్రశ్నలు ఉండగా.. దాన్ని 197కు తగ్గించింది. మొత్తంగా 163 ప్రశ్నలను తొలగించింది. అదే సమయంలో పరీక్షా సమయాన్ని అరగంట పొడిగించింది. 2 గంటల 45 నిమిషాల సమయాన్ని 3:15 నిమిషాలకు పెంచింది.
ప్రతి పేపర్కూ వంద మార్కులు..
ప్రతి పేపర్కూ వంద మార్కులు ఉంటాయి. ఉదాహరణకు జనరల్ సైన్స్ పేపర్-1 (ఫిజికల్ సైన్స్), జనరల్ సైన్స్ పేపర్-2, (బయోలాజికల్ సైన్స్) ఉండగా.. ఈ రెండింటినీ కలిపి ఒకటిగానే నిర్వహిస్తారు. ఈ రెండింటికీ కలిపి వందమార్కులను కేటాయిస్తారు. జనరల్ సైన్స్ ప్రశ్నా పత్రాన్ని ఏ, బీగా విభజించారు. ఏ విభాగంలో నాలుగు సెక్షన్లలో ప్రశ్నలను ఇస్తారు. బీ విభాగంలోనూ అదే రకంగా ప్రశ్నలు ఉంటాయి. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్కు వేర్వేరుగా ఓఎంఆర్ షీట్లను విద్యార్థులకు అందజేస్తారు. ప్రశ్నా పత్రాలను దిద్దే సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండటానికి వేర్వేరుగా ఓఎంఆర్ షీట్లను అందిస్తారు.
విద్యార్థుల సౌకర్యం కోసమే..
కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ను విధించాల్సి వచ్చింది. ఫలితంగా మూడు నెలలుగా విద్యార్థులు స్కూళ్లకు దూరం అయ్యారు. కీలకమైన పదో తరగతి పరీక్షలను రాయాల్సిన విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. అటు తెలంగాణ, ఇటు తమిళనాడు ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. ఏపీ ప్రభుత్వం రద్దు జోలికి వెళ్లలేదు. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ప్రశ్నా పత్రాలను కుదించింది. ప్రభుత్వ పాఠశాలలు, మారుమూల గ్రామాల్లో ఉండే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పరీక్షలకు హాజరు కాలేకపోతున్నారంటూ వచ్చిన విజ్ఙప్తులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేశారు.