ఆదాయం కోసం ప్రభుత్వం ఆశలు - వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీం : తాజా ఉత్తర్వులతో..!!
ఆర్దిక కష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలు పెంచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఏ అవకాశాన్నీ వదులుకొనేందుకు సిద్దంగా లేదు. గత ప్రభుత్వాలు పేదలకిచ్చిన ఇళ్ల రిజిస్ట్రేషన్ విషయంలో వడి వడిగా అడుగులేస్తోంది ప్రభుత్వం. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీం కింద రిజిస్ట్రేషన్లు చేసే అధికారాలను గ్రామ, వార్డు సెక్రటరీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆదాయంపై కన్నేసింది. ఈ పథకం ద్వారా ఖజానా నిండుతుందని ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని భావిస్తోంది.

ఆదాయ మార్గాల పై ఫోకస్
దీనికి సంబంధించి గతంలోనే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మీద రాజకీయంగా కొన్ని విమర్శలు వచ్చినా.. ప్రభుత్వం అమలుకు నిర్ణయించింది. అందులో భాగంగా.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి ఇళ్ల బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా లబ్ధిదారుల నుంచి నిర్ణీత మొత్తంలో డబ్బులు కట్టించుకొని వారి ఆస్తులను వారిపేరిట రిజిస్ట్రేషన్ చేసిస్తారు. వీరినే ప్రభుత్వ హక్కుదారులుగా ప్రభుత్వం గుర్తించనుంది.

ఒన్ టైం సెటిల్ మెంట్ అవకాశం
జగన్ తన పాదయాత్ర సమయంలో గతంలో ఇంటి కోసం తీసుకున్న లబ్ధిదారుల రుణాలను మూడులక్షల వరకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ వన్ టైం సెటిల్మెంట్ కింద లబ్ధిదారులు గ్రామాల్లో ఐతే రూ.10వేలు, పట్టణాల్లో అయితే రూ.15వేలు, నగరాల్లో ఐతే 20వేలు చెల్లించాలి. అదే లబ్ధిదారుల ఇళ్లను మరొకరు కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఈ డబ్బులకు రెట్టింపు చెల్లించాలి. అంటే గ్రామాల్లో 20వేలు, పట్టణాల్లో 30వేలు, నగరాల్లో 40వేలు చెల్లించాల్సి ఉంటుంది.

పది వేల రెవిన్యూ టార్గెట్
ప్రభుత్వం ఎన్టీఆర్ హయాం నుంచి లెక్కలు వేస్తుండటంతో అప్పటి నుంచి ఇళ్లు భారీగానే చేతులు మారే అవకాశం ఉంటుందని భావిస్తుంది. ఈ నేపథ్యంలో సగటున ఒక్కో ఇంటికి 20వేలు లబ్ధిదారులు డబ్బులు చెల్లించినా దాదాపుగా ప్రభుత్వానికి 10వేల కోట్ల రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 50 క్షల మంది పేదలు రుణాలు కట్టాల్సి ఉందని అంటున్నారు. వీరిలో 4.57లక్షల మంది పట్టణ ప్రాంతాల లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో కనీసం సగం మంది పథకంలో డబ్బులు కట్టినా రూ.5వేల కోట్లుసర్కారు ఖజానాకు జమ అవుతాయి.
Recommended Video

వార్డు కార్యదర్శులకు బాధ్యతలు
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వన్ టైం సెటిల్మెంట్ ను లబ్దిదారులు ఏమేరకు సద్వినియోగం చేసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక, ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం గ్రామ, వార్డు సెక్రటరీలపై వన్ టైం సెటిల్ మెంట్ బాధ్యత పెట్టింది. వారు ఈ పథకాన్ని ఎలా సక్సెస్ చేస్తారు.. ప్రభుత్వం ఆశించిన మేర ఆదాయం ఈ స్కీం ద్వారా సాధించగలుగుతారా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications