Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎస్సీ వర్గీకరణ, 30 ఏళ్ల పోరాటం - జరిగిందేంటీ, జరిగేదేంటి..!!

ఎస్సీ వర్గీకరణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సి ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీం కోర్టు తీర్పు మేరకు వర్గీకరణ చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయాలని నిర్ణయించినట్లు, నూతన జనాభా లెక్కింపు పూర్తయిన అనంతరం వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేస్తామని స్పష్టం చేసారు. అసలు ఈ వర్గీకరణ వివాదం ఏంటి. మూడు దశాబ్దాలుగా జరిగిందేంటి. ఇప్పుడు ఈ నిర్ణయం అమలు తో జరిగేదేంటి. వస్తున్న స్పందన ఎలా ఉంది.

మూడు దశాబ్దాల పోరాటం
ఎస్సీ వర్గీకరణ పోరాటానికి మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. షెడ్యూల్డు కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్‌తో 1994లో ఈ ఉద్యమం మొదలైంది. ఉమ్మడి ఏపీలో నాడు మొత్తం 59 కులాలు షెడ్యూల్డు కులాల జాబితాలో ఉన్నాయి. కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,078. వీరిలో మాదిగలు 67,02,609 మంది కాగా, మాలలు 55,70,244 మంది. అంటే మాదిగల జనాభా మాలలకన్నా దాదాపు 11.3 లక్షలు ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు తేల్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో ఈ రెండు కులాల జనాభానే 80 శాతం వరకూ ఉన్నట్లు అంచనా వేసారు. మిగతా 57 కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులానిది. వీరు మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు.

AP Govt likely to issue an ordinance for implementation of SC Classification

రిజర్వేషన్ల కోటా
ఎస్సీలకు మొత్తంగా 15 శాతం రిజర్వేషన్ కోటా ఉంది. అయితే, ఈ కోటాలో మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ జరిగింది. 1972 నుంచి మొదలై, ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ మాదిగ నేతలు వారిని కలవటం, ఈ అంశాన్ని లేవనెత్తుతూ వారికి విజ్ఞప్తులు ఇవ్వటం పరిపాటిగా మారిపోయింది. జనాభా పరంగా మాలలకన్నా మాదిగల సంఖ్య ఎక్కువ అయినప్పటి కీ, విద్యా, ఉద్యోగావకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని 1996లో జస్టిస్ రామ చంద్రరాజు కమిషన్ తేల్చింది. రాజకీయ రంగంలో కూడా ఈ తేడా స్పష్టంగా గుర్తించారు. రిజర్వే షన్ల ద్వారా ఎస్సీలకు లభించిన ఉద్యోగాల్లో దాదాపు 80 శాతం మాలలకు దక్కుతుండగా.. 20 శాతం మాత్రమే మాదిగ, ఉపకులాలకు దక్కినట్లు వాదన ఉంది.

ఎమ్మార్పీఎస్ ఉద్యమం
ఈ నేపథ్యంలోనే ఎస్సీ కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి, ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఎస్సీ రిజర్వేషన్ కోటాను పంచాలనే డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ బాధ్య త తీసుకుంది. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా, 1997 జూన్ 6న ఆనాటి ప్రభుత్వం 15 శాతం ఎస్సీ కోటాను విభజిస్తూ ఓ జీవోను విడుదల చేసింది. అయితే, మాల మహా నాడు దీనిపై కోర్టుకు వెళ్లింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధికి మించిందనీ, రాజ్యాంగ విరుద్ధమైందనీ ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం, ఈ వర్గీకరణ చేయడానికి ముందు, ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను సంప్రదించాల్సి ఉండిందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో, వర్గీకరణ ప్రక్రియ నిలిచిపోయింది.

ఉషా మెహ్రా కమిషన్
ఆ తర్వాత, 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకర ణ చట్టం చేసింది. నాటి రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి నారా యణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో ఎస్సీలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరి స్తూ, వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు. కాగా..
2004 నవంబర్‌లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుక్కెదురైంది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్ వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికా రం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేయటంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత 2004లో వైస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. దానికి ప్రతిస్పందనగా, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఉషా మెహ్రా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

AP Govt likely to issue an ordinance for implementation of SC Classification

కమిషన్ నివేదిక
2008 మేలో మంత్రి మీరాకుమార్‌కు కమిషన్ నివేదికను సమర్పించింది. రాజ్యాంగంలోని ఆర్ టికల్ 341కు సవరణ చేయాలని, ఆ ఆర్టికల్‌లో 3వ క్లాజును చేర్చడం ద్వారా, రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంటును ఆమోదించవచ్చని ఉషా మెహ్రా సిఫార్సు చేశారు. అనేక పరిణామాల తరువాత సుప్రీంకోర్టు ఎస్సీలలో ఉపవర్గీకరణకు అను కూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో ఈ తీర్పు చెప్పింది. ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్ తులు ఈ వర్గీకరణను సమర్థించగా, ఒకరు వ్యతిరేకించారు. దీంతో.. తెలంగాణ లో, ఏపీలో ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేసి వర్గీకరణ పైన నివేదికలు కోరారు. కమిషన్ల నుంచి అందిన నివేదికలను రెండు రాష్ట్ర ప్రభుత్వాల మంత్రివర్గ భేటీల్లో ఆమోదం దక్కింది.

అమలు ప్రభావం
ఫలితంగా అసెంబ్లీలో తీర్మానం చేసారు. ఏపీలో ముందుగా రాష్ట్రం యూనిట్ గా.. జనాభా లెక్కల తరువాత జిల్లాల యూనిట్ వర్గీకరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కాగా, ఈ నిర్ణయం పైన నెల్లూరు జిల్లాలో చేసిన క్షేత్ర స్థాయి పరిశీలనలో ఆసక్తి కర అంశాలు వెలు గులోకి వచ్చాయి. ఈ నిర్ణయాన్ని వర్గీకరణ కోరుకున్న వారు హర్షిస్తున్నారు. అయితే, ఈ వర్గీకరణ ద్వారా తమకు జరిగే ప్రయోజనం గురించి పూర్తి స్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక.. మాల వర్గానికి చెందిన వారు ఆచితూచి స్పందిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాల్సి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

లాభ - నష్టాల పై చర్చ
కొందరు మాత్రం ఈ నిర్ణయం కారణంగా ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందనే వాదనను ప్రభుత్వంలోని ముఖ్య నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎవరికీ అన్యాయం జరగదని చెబుతున్నారు. ఈ వర్గీకరణ అమలులో న్యాయ పరమైన - సామాజిక అంశాలు ఉండటంతో పూర్తి సమాచారం వచ్చి న తరువాత మాత్రమే స్పందించాలని మరి కొన్ని వర్గాల నేతలు భావిస్తున్నారు. ఎమ్మార్సీఎస్ నేతలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మాల వర్గానికి చెందిన ముఖ్యులు ఈ నిర్ణయం అమలు ద్వారా జరిగే లాభ - నష్టాల పైన చర్చిస్తున్నారు. ఇక.. జిల్లా యూనిట్ గా అమలు చేసే సమయం లో ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తి కర చర్చగా మారుతోంది. దీంతో.. ఇప్పుడు వర్గీకరణ అమలు రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది. రాజకీయంగానూ ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తిని పెంచుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+