దిస్ ఈజ్ హాల్ మార్క్ ఆఫ్ చంద్రబాబు- ఇకపై హబ్ అండ్ స్పోక్ ఎయిర్ పోర్ట్స్: ఏపీకి వరాలు
ఏపీ ప్రగతి ప్రస్థానంలో సువర్ణధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ. 17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేశారు. మరికొన్నింటిని ప్రారంభించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేస్తోన్నామని, స్వర్ణాంధ్ర సాకారం దిశగా అడుగులు వేస్తోన్నామని అన్నారు. ఈ విమానాశ్రయం ఏపీ భవిష్యత్ వృద్ధికి బాటలు వేస్తుందని, ఉత్తరాంధ్ర దశ దిశ మారిపోతుందని పేర్కొన్నారు. ఎందరో గిరిజన వీరుల త్యాగాల పురిటిగడ్డ అయిన ఈ మన్యం నేలపై అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడం ద్వారా ఉత్తరాంధ్ర ఉపాధి రంగంలో పెను మార్పులు వస్తాయని, ఇక్కడి యువతకు ఉజ్వలమైన అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రగామిగా ఉందని ప్రధాని మోదీ కితాబిచ్చారు. దీనికి ఈ రూ. 18,000 కోట్ల విలువైన నూతన ప్రగతి పనులే నిదర్శనమని వ్యాఖ్యానించారు. సమగ్ర అభివృద్ధికి చంద్రబాబు హాల్ మార్క్ గా నిలిచారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్టులు రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని అన్నారు.
నూతనంగా చేపట్టిన జాతీయ రహదారుల విస్తరణ, పారిశ్రామిక కారిడార్లు, అత్యుత్తమ రవాణా కనెక్టివిటీ, లాజిస్టిక్ తో ఏపీ ఆర్థిక రంగానికి ఊపు రాబోతోందనిని ఆయన అన్నారు. చంద్రబాబు ఆలోచనా విధానాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు ఒకే సమయంలో ఆధునిక సాంకేతిక ప్రగతి, సంప్రదాయ గిరిజన కళలను సమానంగా ప్రోత్సహించడం గొప్ప విషయమని ప్రశంసించారు.
ఒకవైపు ఆధునికతకు పెట్టింది పేరైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే.. మరోవైపు సంప్రదాయాన్ని ఏ మాత్రం విస్మరించకుండా థింసా నృత్య కళారూపంతో గిరిజనులను ప్రపంచ రికార్డు సృష్టించడానికి ఆయన సహకరించారని చెప్పారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే సరికొత్త పారిశ్రామిక ఆవిష్కరణలతో ముందుకు సాగడం సమతుల్యమైన పరిపాలనకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.
గత 12 ఏళ్లలో దేశీ విమానయాన రంగంలో అసాధారణ పురోగతి సాధించామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. 2014 వరకు దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవని, వాటి సంఖ్య ఇప్పుడు 166కు చేరిందని అన్నారు. ఉడాన్ స్కీమ్ వల్ల ప్రధాన నగరాలకే పరిమితమైన విమాన ప్రయాణం ఇప్పుడు చిన్నస్థాయి పట్టణాల వరకూ విస్తరించిందని చెప్పారు. ఇటీవలే వారణాశిలో హబ్ అండ్ స్పోక్ మోడల్ విమానాశ్రయాన్ని ప్రారంభించామని, ఆ తర్వాత అమృత్సర్కు, ఇప్పుడు ఏపీకి చేరిందని అన్నారు.
దేశం బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తోన్నామని, ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తీరప్రాంత ఫైనాన్షియల్ కారిడార్గా అభివృద్ధి చేయాలన్నది తమ దార్శనికతగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ లక్ష్యంతో విశాఖపట్నం నుండి కృష్ణపట్నం వరకు ఉన్న అన్ని పోర్టులను ఆధునికీకరిస్తున్నామని, అదనంగా ములాపేట, రామాయపట్నంలో కూడా కొత్త ఓడరేవులను నిర్మిస్తున్నామని చెప్పారు. ఏపీ అంతటా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేల నెట్వర్క్ను అభివృద్ధి చేస్తున్నామని, విశాఖపట్నం-రాయ్పూర్ ఎక్స్ప్రెస్వే వంటి ప్రాజెక్టులతో ఈ ప్రాంతం ముఖచిత్రం మారిపోతుందని అన్నారు.













Click it and Unblock the Notifications