21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం: సచివాలయ తరలింపు ఇలా..: లీగల్ చిక్కులు రాకుండా..!
మూడు రాజధానులు..విశాఖలో పరిపాలనా రాజధాని కేంద్రంగా ప్రతిపాదించిన ప్రభుత్వం..ఇప్పుడు అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందు కోసం కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ నివేదికలు అందటంతో ఈ రెండు నివేదికల అధ్యయనం..సిఫార్సుల ప్రభుత్వం హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తొలి సమావేశం మంగళవారం జరగనుంది. ఇక, ఆ కమిటీ నివేదిక సైతం లాంఛనంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో..అధికారికంగా రాజధానుల పైన నిర్ణయానికి ఆమోద ముద్ర కోసం ఈ నెల 20, 21 తేదీల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆ వెంటనే విశాఖకు అమరావతి నుండి కీలక ప్రభుత్వ శాఖల్లోని ముఖ్యమైన సెక్షన్లను తరలించే విధంగా కార్యాచరణ ఖరారు చేస్తున్నారు.
ఎక్కడా న్యాయపరమైన చిక్కులు రాకుండా..గతంలో హైదరాబాద్ నుండి అమరావతికి కార్యాలయాలు తరలించే సమయంలో చంద్రబాబు అనుసరించిన విధానాన్నే అనుసరిస్తున్నారు.

ఈ నెల 21న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం..
మూడు రాజధానుల అంశానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతిపక్షాలు..అమరావతి ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా...ముందుకే వెళ్లాలని భావిస్తోంది. ఇక, ఇప్పటికే ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ నివేదికలు అందాయి. వీటి మీద ప్రభుత్వం 10 మంది మంత్రులు...ఆరుగురు అధికారులతో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ తొలి సమావేశం మంగళవారం విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో జరగనుంది. ఈ నెల 17న ఈ కమిటీ సీఎం కు నివేదిక ఇవ్వనుంది. ఆ వెంటనే 20న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి...అదే రోజు లేదా 21న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఒక్క రోజు సమావేశంలోనే ఈ అంశం పైన చర్చించి అధికారికంగా మూడు రాజధానులు..విశాఖ నుండి పరిపాలనా రాజధానిగా ఖరారు పైన ఆమోద ముద్ర వేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.

సచివాలయ తరలింపు కార్యాచరణ ఖరారు..
ఇక, విశాఖ లో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేయటం..కమిటీలు అనుగుణంగా నివేదికలు ఇవ్వటంతో నిర్ణయం లాంఛనంగా మారనుంది. దీని కోసం విశాఖ కు సచివాలయ విభాగాల తరలింపు విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా..ముందుగా ప్రభుత్వ పాలనలో మొత్తంగా ముఖ్యమైన 34 పోర్టుఫోలియోల్లోని కీలక శాఖల్లో అతి ముఖ్యమైన సెక్షన్లను తొలుత విశాఖ కు తరలించాలని భావిస్తోంది. ఆ దిశగా మౌఖిక ఆదేశాలు జారీ చేస్తోంది. ఈ నెల 23 తరువాత ముందుగా సాధారణ పరిపాలనా శాఖ నుండి మూడు సెక్షన్లు.. ఆర్దిక శాఖ నుండి చెల్లింపులకు సంబంధించిన రెండు సెక్షన్లు..ఉన్నత విద్యకు సంబంధించిన రెండు సెక్షన్లు తరలించే విధంగా మౌఖిక ఆదేశాలు అందాయి. దీని కోసం ముందుగా ఆ సెక్షన్లలో పని చేసే సిబ్బందిని విశాఖకు మార్పు కింద కాకుండా వారంతా ఆన్ డ్యూటీ కింద విశాఖలో పని చేసే విధంగా వారిని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.

చంద్రబాబు చేసిన విధంగానే...
హైదరాబాద్ నుండి అమరావతికి సచివాలయం..ప్రభుత్వ శాఖల తరలింపు విషయంలో నాడు చంద్రబాబు అనుసరించిన విధానాన్నే ఈ ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తోంది. ముందుగా ఒక్కో శాఖలోని కొన్ని సెక్షన్లను ఆన్ డ్యూటీ పేరుతో విశాఖకు తరలించాలని నిర్ణయించారు. అసెంబ్లీలో చర్చకు సమాధానంలో భాగంగా అమరావతిలో కొనసాగించే శాఖల గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. దీంతో.. తరలించే శాఖలు..ఉద్యోగాలకు ప్రభుత్వం నుండి కల్పించే సౌకర్యాల పైన మంత్రులు..సీనియర్ అధికారులతో కమిటీ వేసి ఉద్యోగులకు వివరించనుంది. ఇక, ప్రభుత్వం నిర్ణయం పైన ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో న్యాయపరంగా వారు పోరాటానికి దిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో..ముందుకు వెళ్లటంలో ఎక్కడా న్యాయ పరమైన చిక్కులకు అవకాశం లేకుండా దశల వారీగా కార్యాచరణ అమలు చేయాలని ప్రభుత్వంలోని ముఖ్యులు డిసైడ్ చేసారు.












Click it and Unblock the Notifications