మహిళలు, రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం నిధుల జమ..!!
ఏపీలో ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ విదేశాల్లో ఉన్నారు. చంద్రబాబు సైతం అమెరికా వెళ్లారు. ఇక..ఎన్నికల ముందు చర్చకు కారణమైన డీబీటీ పథకాల లబ్దిదారులకు నగదు జమ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ సూచనలతో పోలింగ్ ముందు నిధులు విడుదల కాలేదు. ఇప్పుడు నాలుగు రోజుల్లోనే రూ 5868 కోట్లు జమ చేసారు.
ఏపీలో ఎన్నికలు పూర్తవటంతో పథకాల నిధులు జమ అయ్యాయి. పోలింగ్ ముందు ఈ నిధుల విడుదల కోసం ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే, ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు. పోలింగ్ పూర్తయిన తరువాత నిధులు విడుదల చేయాలని సూచించింది. ఈ అంశం పైన కోర్టుల్లోనూ విచారణ జరిగింది. పోలింగ్ పూర్తయిన తరువాత 15వ తేదీ నుంచి ఈ పథకాల పెండింగ్ నిధులు వరుసగా విడుదల చేసారు. అందులో భాగంగా..డీబీపీ పథకాల కింద వరుసగా నాలుగు రోజుల్లో రూ 5868 కోట్లను ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లోజమ చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు రూ. 1843 కోట్లు జమ చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రైతుల ఖాతాల్లోకి రూ. 1236 కోట్లు విడుదల చేసారు. వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1552 కోట్లను లబ్ధిదారుల అకౌంట్లలో డిపాజిట్ చేసారు. ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు రూ.629 కోట్లు జమ అయింది. జగనన్న విద్య దీవెన పథకం కింద లబ్ధిదారులైన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద రూ.605 కోట్లు అకౌంట్లలోకి జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారం చివరి రెండు రోజుల్లో జగన్ ఈ పథకాల నిధుల విడుదల పైన హామీ ఇచ్చారు. పోలింగ్ పూర్తయిన తరువాత ఈ నిధుల జమ పూర్తయింది.












Click it and Unblock the Notifications