అక్వా ఫీడ్ ధరలపై తేల్చేసిన ఏపీ సర్కార్..! రైతుల కోర్టుల్లోకి బంతి..!
ఏపీలో కొంతకాలంగా ఆక్వా రైతులు (Aqua farmers) రొయ్యల మేత (Aqua Feed) ధరలు పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే వేసవి కావడం, రొయ్యల మేతల ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వం (AP govt) కూడా ఏమీ చేయలేని పరిస్దితి. ఈ నేపథ్యంలో ఇవాళ విజయవాడలో వ్యవసాయమంత్రి అచ్చెన్నాయుడు.. మరోసారి మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, సముద్ర ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులతో భేటీ నిర్వహించారు.
రొయ్యల ఫీడ్ ధరల పెరుగుదలపై రైతులు, పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చాయని ఆయన తెలిపారు. ఫిష్మీల్, సోయాబీన్ తదితర ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయాలు పెరిగినట్లు తయారీ సంస్థలు వివరించాయన్నారు. ఇప్పటికే ఖర్చుల భారం పెరిగిన నేపథ్యంలో ధరల పెంపును నియంత్రించాలని రైతులు కోరుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆక్వా రంగ సమగ్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైతులు, తయారీదారులు చర్చల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి రావాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిపారు. ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు.

ఫీడ్ ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిపారు. ముడి పదార్థాల ధరలు, టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)తో పాటు మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో పారదర్శక ధరల వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు. ఆక్వాకల్చర్ రైతులకు విద్యుత్ రాయితీపై మాట్లాడుతూ, జూన్ 1 నుంచి అదనంగా 12 వేల ఆక్వాకల్చర్ విద్యుత్ కనెక్షన్లకు యూనిట్కు రూ.1.50 చొప్పున రాయితీ అందించే ప్రక్రియ తుది దశలో ఉందన్నారు. ఉత్తర్వులు జారీ అయిన తర్వాత అర్హత కలిగిన అన్ని ఆక్వాకల్చర్ కనెక్షన్లు అవి చిన్న, పెద్ద ఫారాలు అయినా, ఆక్వా జోన్ లేదా నాన్-ఆక్వా జోన్లో ఉన్నా ఈ పథకం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఉత్పత్తి వ్యయం తగ్గడంతో పాటు రైతులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుందని తెలిపారు.












Click it and Unblock the Notifications