ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు - ఐఆర్, బకాయిలపై కీలక నిర్ణయం..!!
ఏపీలో ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు సిద్దమయ్యాయి. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. కార్యాచరణ ప్రకటించాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చల కు ఆహ్వానించింది. గతంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవటంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఎన్నికల సమయంలో ఉద్యోగుల బకాయిల చెల్లింపుతో పాటుగా మధ్యంతర భృతి పైనా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఉద్యోగ సంఘాల ఆందోళన:ఏపీలో ఎన్నికల సమయంలోనే ప్రభుత్వం పై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. పెండింగ్ అంశాల పైన గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకం పోవటం పైన మరోసారి ఆందోళనకు సిద్దం అయ్యాయి. ఈ నెల 14 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే ఈ నెల 27న 'చలో విజయవాడ'కు సిద్ధమని ప్రకటించారు. సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. 12వ పీఆర్సీకి సంబంధించి కమిషనర్ను నియమించినా పనిచేయటానికి సిబ్బంది, కార్యాలయం వంటివి ఇవ్వలేదన్నారు. ఐఆర్ను కూడా ప్రకటించలేదని చెప్పారు. తాము 30 శాతం ఐఆర్ను డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. పెండింగ్లో ఉన్న రెండు కొత్త డీ ఏలు(జనవరి, జూలై-2023) తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వంతో చర్చలు:సమస్యల పరిష్కారం చేయనందుకు నిరసనగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. దశల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఈ నెల 27న ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. పీఎఫ్, ఏపీజీఎల్వో లోన్లు - క్లెయిమ్స్, 11వ పీఆర్సీ అరియర్స్, సరెండర్ లీవ్ ఎన్క్యా్షమెంట్, మెడికల్ రీయింబర్స్మెంట్ చెల్లించాలని కోరుతున్నారు. మరి కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను క్లియర్ చేయాలని కోరుతున్నారు. దీంతో, ఈ మధ్యాహ్నం చర్చలకు రావాలని ఏపీజీఏడీ శాఖ 13 సంఘాల నేతలకు లిఖిత పూర్వక ఆహ్వానం పంపింది. మంత్రివర్గ బృందం ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. విజయవాడలో జరిగిన ఏపీఎన్జీవో రాష్ట్ర మహాసభల్లో సీఎం జగన్ ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని సంఘాల నేతలు మండి పడుతున్నారు. ఈ రోజు ప్రభుత్వంతో చర్చలు ఫలించకపోతే డిమాండ్లతో కూడిన నోటీసును చీఫ్ సెక్రటరీకి ఇవ్వనున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు.
కీలక నిర్ణయాలు ఉంటాయా:దీంతో, ప్రభుత్వం ఈ రోజు ఉద్యోగ సంఘాలతో చర్చల పైన ఆసక్తి కనిపిస్తోంది. ఉద్యోగులకు అన్ని రకాలుగా దాదాపు రూ 7 వేల కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. గతంలో జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఆర్దికేతర అంశాలు పరిష్కారం అయినా..ఆర్దిక అంశాలు మాత్రం క్లియర్ కాలేదు. ఇక, ఇప్పుడు ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్దం అవుతున్న వేళ ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బకాయిల చెల్లింపు పైన స్పష్టమైన నిర్ణయంతో పాటుగా 12వ పీఆర్సీకి సంబంధించి నివేదిక మరింత సమయం తీసుకోనుండటంటో ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దీంతో, ప్రభుత్వ నిర్ణయాల పైన ఉద్యోగులు వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications