మరో పథకానికి జగన్ శ్రీకారం- వలంటీర్లు, ఎఎన్ఎంలకు బాధ్యతల అప్పగింత
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ఈ నెల 30వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలోని పేదలందరికీ కుటుంబ సంక్షేమం, ఆరోగ్య భరోసా కల్పించడంలో భాగంగా ఈ పథకాన్ని చేపట్టనుంది.
వార్డు/గ్రామ వలంటీర్లు, ఎఎన్ఎంలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్తారు. ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తిస్తారు. ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్న వారి కోసం గ్రామాలు, వార్డుల్లోనే హెల్త్ క్యాంపులను నిర్వహిస్తారు. వైద్య సేవలను అందిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యానికి గురైన వారికి ఆసుపత్రులకూ సిఫార్సు చేస్తారు.

అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించిన అనంతరం ఎఎన్ఎంలు.. తమకు కేటాయించిన క్లస్టర్ హెల్త్ ఆఫీసర్లకు సమాచారం ఇస్తారు. అనంతరం ఎఎన్ఎంలు, క్లస్టర్ హెల్త్ ఆఫీసర్లు వారి ఇంటికి వెళ్తారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. గ్రామం, వార్డుల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటికి తక్షణ వైద్య సేవలను అందిస్తారు.
ఈ వైద్య శిబిరాలన్నీ కూడా ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు, సంబంధిత మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు పర్యవేక్షణలో కొనసాగుతాయి. రోగులకు అక్కడికక్కడే చికిత్స అందిస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల నుంచి ఒక స్పెషలిస్టు డాక్టర్ సైతం ఈ హెల్త్ క్యాంప్లకు హాజరవుతారు.
నెల రోజుల పాటు అంటే అక్టోబర్ 30వ తేదీ వరకు ప్రతి రోజూ ఈ హెల్త్ క్యాంపులు కొనసాగుతాయి. మండలానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రోజూ వైద్య శిబిరాలు కొనసాగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్, ఎంపీడీఓ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే డాక్టర్లు ఇన్ ఛార్జీగా వ్యవహరిస్తారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, అర్బన్ పీహెచ్సీ డాక్టర్లు పర్యవేక్షిస్తారు.
వైద్య శిబిరం వద్ద 105 రకాల మందులు, అన్ని రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంచడానికి జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రజల ఆరోగ్య సమస్యల గురించి తెలుసు కోవడానికి ఈ నెల 15 వ తేదీ నుంచి వలంటీర్లు, 16వ తేదీ నుంచి ఎఎన్ఎంలు తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications