సుప్రీం హెచ్చరికలు : అయినా..సీఎంజగన్ ముందుకే : వచ్చే నెలలో నిర్వహిస్తాం ..!!
ముఖ్యమంత్రి జగన్ తాను కట్టుబడి ఉన్న నిర్ణయంలో ముందుకే వెళ్లాలని డిసైడ్ అయ్యారు. రాజకీయంగా..న్యాయ పరంగా పలు వాదనలు వినిపిస్తున్నా..ముందుకే వెళ్తామని తేల్చి చెప్పారు. తాజాగా ఇంటర్ పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు చేసింది. జూలైలో పరీక్షలు నిర్వహించకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఇతరా రాష్ట్రాల మాదిరిగా ఇప్పుడే నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. దీనికి కొనసాగింపుగా చివరి నిమిషంలో పరీక్షల రద్దు ఉండకూడదని స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేయకూడదని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
పరీక్షలు నిర్వహిస్తామంటూ అఫిడవిట్..
విద్యార్ధులను అనిశ్చితికి గురి చేయవద్దని ఏపీ ప్రభుత్వానికి హితవు చెప్పింది. ఇదే అంశం పైన రెండు రోజుల్లో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సూచనలతో పాటుగా కీలక హెచ్చరిక చేసింది. పరీక్షల కారణంగా ఒక్కరు మరణించినా రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేస్తామని హెచ్చరించింది. అయితే, ఇదే అంశం పైన ఏపీ ప్రభుత్వం సమీక్షించింది. సుప్రీం సూచించిన విధంగా అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో తాము జూలై చివరి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని అందులో స్పష్టం చేసింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఈ అఫిడవిట్ ను దాఖలు చేసారు. రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా తగ్గుతున్నాయని అందులో పేర్కొంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని వివరించింది.
అదే నిర్ణయం పై ముందుకు
ఇదే సమయంలో పరీక్షల నిర్వహణ చేపడతామని..రద్దు చేస్తే విద్యార్ధుల భవిష్యత్ కు నష్టం కలుగుతుందని తొలి నుండి ప్రభుత్వం వాదిస్తోంది. పరీక్షలు రద్దు చేసి ఆ తరువాతి తరగతులకు పంపితే వారి సర్టిఫికెట్లలో కేవల్ పాస్ అని మాత్రమే ఉంటుందని..ఇది తరువాతి కాలంలో వారికి మంచి కాలేజీల్లో సీట్లు..ఉద్యోగాల సమయంలో ప్రభావం చూపిస్తుందనేది ఏపీ ప్రభుత్వ వాదన. కరోనా తగ్గినాక..అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్దులకు మేలు జరుగుతుందనేది ప్రభుత్వం చెబుతున్న అంశం. అయితే, టీడీపీ నేత లోకేశ్..ఇతర పార్టీల నేతలు మాత్రం ముందు విద్యార్ధుల ప్రాణాలు ముఖ్యమని...కేంద్రంతో పాటుగా పలు రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయగా..ఏపీ ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక, ఇప్పుడు సుప్రీంలోనూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయటంతో ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతున్నట్లుగా మరోసారి స్పష్టం అవుతోంది.