జగన్కు టాటా మెగా షాక్- రూ.6400 కోట్ల ప్రాజెక్టు టెండర్లు రద్దు- కథ మళ్లీ మొదటికి
భారత్లో టాప్ వ్యాపార దిగ్గజాల్లో ఒకటైన టాటా గ్రూప్ జగన్ సర్కారుకు భారీ షాకిచ్చింది. ఏపీలో నిర్మించతలపెట్టిన ఓ భారీ ప్రాజెక్టు టెండర్ల విషయంలో ప్రభుత్వాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ప్రభుత్వ చర్యలపై హైకోర్టును ఆశ్రయించిన టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ ఏకంగా ఈ టెండర్లను రద్దు చేయించింది. దీంతో ఈ మెగా ప్రాజెక్టు టెండర్ల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. దీంతో జగన్ సర్కార్ కూడా డిఫెన్స్లో పడాల్సి వచ్చింది. అసలు టాటా పవర్ ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన ఆ మెగా ప్రాజెక్టు వివరాల్లోకి వెళ్తే..
మెగా సోలార్ ప్రాజెక్టు
ఏపీలో వ్యవసాయరంగానికి రూ.6400 కోట్లతో సౌర విద్యుత్ అందించేందుకు వైసీపీ ప్రభుత్వం ఓ భారీ సోలార్ ప్రాజెక్టుకు ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో పది సోలార్ పవర్ ప్లాంట్లు మరియు పార్కుల ఏర్పాటుకు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ లిమిటెడ్ గతేడాది నవంబర్లో టెండర్లు ఆహ్వానించింది. దీంతో ఈ ఏడాది జనవరిలోనే టెండర్లు కూడా నిర్వహించారు. వీటిలో టెండర్లు గెల్చుకున్న వారు ఈ ఏడాది పనులు ప్రారంభించి పూర్తి చేస్తే ఏపీలో వ్యవసాయ రంగానికి పూర్తిస్ధాయిలో ఉచిత విద్యుత్ అందించేందుకు వీలు కలిగేది. కానీ అక్కడే ట్విస్ట్ ఎదురైంది.
టాటా పవర్ అభ్యంతరాలివే
అంతా సవ్యంగా సాగుతుందని అనుకున్న తరుణంలో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ రంగంలోకి దిగింది. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన టెండర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అభ్యంతరాలు లేవనెత్తుతూ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం టెండర్లలో ఏయే నిబంధనలు ఉల్లంఘించిందో సవివరంగా హైకోర్టుకు అందజేసింది. దీంతో హైకోర్టు టెండర్లలో విజేతలుగా నిలిచిన వారికి పనులు అప్పగించకుండా జనవరిలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో కేంద్ర విద్యుత్ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా టెండర్లు ఉన్నాయని టాటా పవర్ వాదించింది. 2003 నాటి విద్యుత్ చట్టం ఏపీఈఆర్సీకి కల్పించిన విచారణాధికారాలను పీపీఏతో పాటు రిక్వెస్ట్ ఫర్ సెలక్షన్ (ఆర్ఎఫ్ఎస్)లో తొలగించాలని టాటా పవర్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
జగన్ సర్కార్కు హైకోర్టు షాక్
కేంద్ర విద్యుత్ చట్టంలోని టెండర్ నిబంధనల ఉల్లంఘనపై టాటా పవర్ లేవనెత్తిన అభ్యంతరాలతో హైకోర్టు మెగా సోలార్ ప్రాజెక్టు టెంటర్లను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఈ టెండర్ల ప్రక్రియ అంతా మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మరోసారి కేంద్ర విద్యుత్ చట్టంలో నిబంధనల ఆధారంగా మరోసారి టెండర్ నోటిపికేషన్ జారీ చేసి టెండర్లు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి సవాలక్ష సమస్యలున్నాయి. ఇప్పుడు ఈ టెండర్లను ఆహ్వానించడం, వాటిపై నిర్ణయాలు తీసుకోవాలంటే మరింత సమయం వృథా కావడం ఖాయం.