ఏపీలో ఐదుగురు ఐఏఎస్ లకు హైకోర్టు షాక్-జైలుశిక్ష, జరిమానా-సీఎంవో సహా కీలక విభాగాల్లో అధికారులు
ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసుల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ మరో కీలక ఆదేశం వెలువడింది. ఓ కోర్టు ధిక్కార కేసులో ఏపీ హైకోర్టు ఏకంగా ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలుశిక్ష విధించడంతో పాటు జరిమానా కూడా విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
YSR Death Anniversary: వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన సీఎం జగన్, వైయస్ షర్మిల(ఫోటోలు)
నెల్లూరు జిల్లాలోని తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే అనే మహిళ వద్ద భూమి తీసుకున్న అధికారులు పరిహారం మాత్రం చెల్లించలేదు. దీంతో గతంలో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన హైకోర్టు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు తగిన పరిహారం ఇవ్వాలని అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. అయినా ఆ ఆదేశాలు ఇప్పటికీ అమలు కాలేదు. దీంతో పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇందుకు బాధ్యులైన ఐఏఎస్ అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు నెల రోజుల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు 2 వారాల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, ప్రస్తుత ఆర్ధికశాఖ కార్యదర్శి రావత్ కు నెల రోజుల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, సీఎంవోలో జీఏడీ పొలిటికల్ కార్యదర్శిగా ఉన్న ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, జరిమానా విధించింది. అలాగే మరో ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కు సైతం రెండు వారాల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.
గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కార చర్యల కింద హైకోర్టు జైలుశిక్షలతో పాటు జరిమానా విధించింది. ఇందులో అధికారులకు విధించిన జరిమానాల్ని వారి జీతాల నుంచి వసూలు చేసి పిటిషనర్ కు ఇవ్వాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో అధికారులు ఇరుకునపడ్డారు. వీరికి హైకోర్టు విధించిన శిక్ష, జరిమానాపై అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా నెల రోజుల పాటు శిక్షల్ని సస్పెండ్ చేసింది.