లోన్ యాప్ ఆగడాలపై చంద్రబాబు సూచన-హోంమంత్రి కీలక ఆదేశాలు
ఏపీలో లోన్ యాప్స్ ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ట్వీట్ చేశారు. లోన్ యాప్ల వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. నిన్న రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య ఘటన మరువకముందే ఈరోజు పల్నాడులో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని గుర్తుచేశారు..
ముఖ్యంగా మహిళల గౌరవాన్ని బజారుకీడుస్తూ వేధిస్తున్న ఇలాంటి లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. అంతేకానీ చావు పరిష్కారం కాదన్నారు. ప్రభుత్వం, పోలీసులు కూడా ఇటువంటి యాప్ ల గురించి ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాధితులకు అండగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వాలన్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. రాష్ట్రంలో లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను తానేటి వనిత ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న హోంమంత్రి ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆన్ లోన్ యాప్ లకు సంబంధించిన సమాచారాన్ని, యాప్ నిర్వాహకుల వేధింపులపై నమోదైన కేసుల వివరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని హోంమంత్రి పోలీసులకు సూచించారు.
రిజర్వ్ బ్యాంకు అనుమతులు లేని లోన్ యాప్ లను గుర్తించి, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హోంమంత్రి వనిత ఆదేశించారు. ఇతర దేశాలు, వివిధ రాష్ట్రాల నుండి ఆన్ లైన్ లో లోన్ యాప్ నిర్వహిస్తున్న గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. అదేవిధంగా అనుమతులు లేని యాప్ లను గుర్తించి.. సంబంధిత అధికారులకు పంపించినట్లు పేర్కొన్నారు. లోన్ యాప్ ల పేరుతో వేధింపులకు గురిచేస్తూ..ప్రజల ప్రాణాలతో చేలాగటం ఆడుతున్న నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని హోంమంత్రి తానేటి వనిత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
రాజమండ్రి లో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి కుటుంబసభ్యులకు హోం మంత్రి వనిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరిని వేధింపులకు గురిచేసిన లోన్ యాప్ నిర్వహకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ లను ఆదేశించారు. ఈ ఘటనకు కారణమైన లోన్ యాప్ నిర్వాహకుల కోసం ప్రత్యేకంగా మూడు బృందాలను పంపించినట్లు హోంమంత్రి కి వివరించారు. రాజమండ్రి దంపతుల ఆత్మహత్య కు కారణమైన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్ లైన్ లోన్ యాప్ ల మాయ లో పడి మోసపోకండి అని ప్రజలకు హోంమంత్రి సూచించారు. సీఎం జగన్ మానవతా దృక్పథంతో చనిపోయిన దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి పిల్లలకు ఆర్థిక సహాయం చేసినందుకు హోంమంత్రి తానేటి వనిత ప్రత్యేక అభినందనలు తెలిపారు.