చంద్రబాబుకు ఘోర అవమానం..జగన్కు వజ్ర సంకల్పం: అన్నింటికీ అడ్డు: ఉనికి ఉండదిక: మంత్రి
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటున్నారని, ఇందులో సైంధవపాత్రను పోషిస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఆరోపించారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలను పంచితే.. తెలుగుదేశం పార్టీ నామరూపాల్లేకుండా పోతుందనే భయం చంద్రబాబులో కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.
రూటు మార్చిన పీవీపీ? మోడీకి జై కొట్టిన వైసీపీ నేత: నెహ్రూలా మోసపోలేదంటూ: మరో రఘురామలా?
రాష్ట్రంలో 25 లక్షల మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా చేపట్టిన పాదయాత్రలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని నిలబెట్టుకోవడానికి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే భూసేకరణను పూర్తి చేశామని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను సేకరించామని చెప్పారు. 25 లక్షలు మాత్రమే కాదు. మరో అయిదు లక్షల మందికి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తామని అన్నారు.
దేవతలు యజ్ఞం చేస్తుంటే.. రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేస్తారని తాము పురాణాల్లో చదువుకున్నామని, అదే పద్ధతిలో చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారు చరిత్ర హీనులు కాక తప్పదని అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీని వ్యతిరేకిస్తూ చంద్రబాబు అనుచరులు హైకోర్టులో కొన్ని వందల రిట్ పిటిషన్లు దాఖలు చేశారని ఆరోపించారు.
నాలుగు రిట్ పిటీషన్లకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ఇళ్ళ పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను పేదలకు ఇవ్వడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. దీనిపై తాము సుప్రీంకోర్టులో సవాల్ చేశామని రంగనాథ రాజు గుర్తు చేశారు. అవరోధాలన్నీ తొలగి ఆగస్టు 15 నాటికి రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను పంపిణీ చేస్తామని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వజ్ర సంకల్పంతో ఉన్నారని చెప్పారు.
చంద్రబాబు హయాంలో రెండు లక్షల ఇళ్లు కూడా కట్టించలేకపోయారని రంగనాథ రాజు ఆరోపించారు. ఆ అవమానంతోనే ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ 30 లక్షలమందికి ఇళ్ల పట్టాలు ఒకేసారి ఇస్తే..తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయం చంద్రబాబులో వ్యక్తమౌతోందని అన్నారు. తన హయాంలో లక్షలాది ఇళ్లను నిర్మించామని చంద్రబాబు వితండవాదం చేస్తున్నారని, ఎక్కడ కట్టారో ఆయనకే తెలియాలని రంగనాథ రాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో కట్టిన నివాసాలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదని, ఆయన పెట్టిన టిడ్కో బకాయిలు మూడు వేల కోట్ల రూపాయలకు పెరిగాయని అన్నారు.