ఏపీతో పోటీ కాదు, రాజకీయం వద్దనుకున్నా: కేసీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తమకు పోటీ కాదని, బంగారు తెలంగాణనే తన కల అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయాల నుండి తప్పుకోవాలనుకున్నానని, బంగారు తెలంగాణ కోసం ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లో కొనసాగుతున్నానని ఆయన చెప్పారు.
తెలంగాణ ఏర్పడినాక రాజకీయాల నుండి తప్పుకొని పుస్తకాలు చదువుకుంటూ, రాసుకుంటూ జీవితం గడపాలనుకున్నానని కానీ, ఎవరి చేతిలోనో రాష్ట్రాన్ని పెడితే ఏమై పోతుందోనని అందరూ ఆందోళన వ్యక్తం చేయడంతో పగ్గాలు చేపట్టానన్నారు. నిరుద్యోగం, రోగాలు, ఆకలి చావులు లేని తెలంగాణ చూడటం తప్ప.. తనకు మరే ఆశలు లేవన్నారు. తెలంగాణ కోసం అహర్నిషలు కష్టపడతానన్నారు. ఇంకో ఐదేళ్లో, పదేళ్లో పని చేస్తే వృద్దాప్యం వస్తుందని, యువత పగ్గాలు అందుకుంటుందన్నారు.
తనకు మేనిఫెస్టోనే భగవద్గీత అన్నారు. అన్ని వర్గాలతో మాట్లాడి మేనిఫెస్టోను రూపొందించామన్నారు. కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిపుణులతో కలిసి అన్ని నదులపై హెలికాప్టర్లతో అధ్యయనం చేసి సరైన స్థలాలు గుర్తిస్తామన్నారు. కరెంట్ గొనుగోలుకు కొత్త లైన్ నిర్మాణం ఏడాదిన్నరలోగా పూర్తవుతుందన్నారు. కాంట్రాక్ట్ ఉధ్యోగులను క్రమబద్దీకరిస్తే ఉద్యోగాలు రావని కొందరు అనుకునేది సరికాదన్నారు.

పేదలకు, ముస్లింలకు, గిరిజనులకు, దళితులకు అందరి అభివృద్ధి కావాలని అభిప్రాయపడ్డారు. దళితులు, గిరిజనుల కష్టాలు తీర్చేందుకు కళ్యాణలక్ష్మి పథకం తెచ్చానని చెప్పారు. ప్రభుత్వ పథకాలలో దారుణమైన అవినీతి కనిపిస్తుందని, దానిని రూపుమాపాల్సి ఉందన్నారు. పథకాలలో భయంకరమైన నిధుల దుర్వినియోగం ఉందన్నారు. అలాగే, హైదరాబాదులో అక్రమ కట్టడాలు ఉన్నాయన్నారు.
హైదరాబాదును హైటెక్ అని ఇంతకాలం చెబుతున్నా.. వర్షం పడితే ఎక్కడపడితే అక్కడ నీళ్లు నిలుస్తాయన్నారు. తాను ఓ మురికివాడను దత్తత తీసుకొని వారికి పక్కాగా భవనాలు కట్టించి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు. క్లీన్, గ్రీన్ హైదరాబాదును నిర్మిస్తామన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో ఎవరి పైన తనకు కక్ష లేదన్నారు. రైతులకు రుణమాఫీ చాలా ఉపయోగకరమన్నారు. అలాగే మేనిఫెస్టోలో పెట్టిన పింఛన్లు ఇస్తామన్నారు.
పారిశ్రామిక విధానం పకడ్బందీగా తెస్తామన్నారు. హైదరాబాదును ప్రపంచస్థాయి నగరంగా మార్చుతామన్నారు. అవినీతి లేకుండా సింగిల్ విండో విధానం ద్వారా పెట్టుబడులు ఆహ్వానిస్తామని, ఛేజింగ్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. పారిశ్రామికవేత్త పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాడంటే శంషాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా సీఎం కార్యాలయానికి ప్రోటోకాల్ అధికారులు తీసుకు వస్తారన్నారు. హైదరాబాద్ రియల్ ఎశ్టేట్ రంగం కూడా చాలా ముఖ్యమని, ప్రతినిధులతో చర్చించి ప్రోత్సహిస్తామన్నారు.
తెలంగాణ విద్యార్థులకు లబ్ధి చెందే విధంగా ఆర్థిక సాయం పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన ఏపీ ప్రభుత్వం అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హార్టీకల్చర్, గిరిజిన విశ్వవిద్యాలయం హైదరాబాదు బయట నెలకొల్పుతామన్నారు. అలాగే కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంద విద్య అమలు చేస్తామన్నారు. ముస్లీంలకు రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు.
తెలంగాణలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. కేసీఆర్ ఒక వ్యక్తి కాదని, కోట్ల మంది ప్రజలు తన వెనుక ఉన్నారన్నారు. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదని.. వెనకకు నెట్టేశారన్నారు. నిజాం కాలంలో తాము సర్ప్లస్ బడ్జెట్లో ఉన్నామని చెప్పారు. 40.6 శాతం అర్బనైజేషన్ ఉందన్నారు.












Click it and Unblock the Notifications