ఏపీ ఎంసెట్ : టాప్-10 లో ఆరుగురు తెలంగాణ విద్యార్థులే..
విజయవాడ : రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ ముందుగా ప్రకటించినట్టుగానే, ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలను విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. దీని కోసం సహకరించిన కన్వీనర్ సాయిబాబా, కాకినాడ జేఎన్టీయూ సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇక ఫలితాల విషయానికి వస్తే.. ఏపీ ఎంసెట్ లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 10 జాబితాలో ఆరుగురు తెలంగాణ విద్యార్థులు చోటు సంపాదించడం గమనార్హం. కాగా, టాప్ 10 జాబితాలో 6 మంది అమ్మాయిలకు, నలుగురు అబ్బాయిలు చోటు సంపాదించారు.
మెడికల్ టాపర్ గా 156 మార్కులు సాధించిన మాచాని హేమలత ఎంసెట్ మొదటి ర్యాంకును దక్కించుకుంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో 155 మార్కులతో యర్ల సాత్విక్ రెడ్డి , యజ్ఞప్రియ 153, చిట్లూరి నేహ 152, విక్రమ్ ఖాన్ 152, శొంఠి సావిత్రి 152, పెద్దిరెడ్డి శైలజ 150, బలబద్ర గ్రీష్మ 150, దారం శివకుమార్ 150, సాయి ప్రతాప్ రెడ్డి 150, సత్తా చాటారు.
ఇందులో రెండో స్థానంలో నిలిచిన యర్ల సాత్విక్ రెడ్డి రంగారెడ్డికి చెందినవాడు కాగా, అమ్మకుల యజ్ఞప్రియ, విక్రమ్ ఖాన్, సాహితి, బలభద్ర గ్రీష్మ శివకుమార్ హైదరాబాద్ కు చెందినవారు కావడం గమనార్హం.

ఫలితాల విడుదల సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఎంసెట్ నిర్వహణలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడ్డ అధికారులను అభినందించారు. అలాగే మెడికల్ టాప్ 10 లో సత్తా చాటిన విద్యార్థులకు కూడా అభినందనలు తెలిపారు. ఇక నీట్ పరీక్షపై స్పందిస్తూ.. తాను విదేశాల్లో ఉన్నప్పటికీ మెడికల్ ఎంట్రన్స్ రాసిన విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవ్వొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ న్యాయవాదులతో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయించామని, కేంద్రంతోను ఆర్డినెన్స్ కు ఒప్పించేలా చేశామని చెప్పారు.
ఏడాదిపాటు కష్టపడిన విద్యార్థుల శ్రమ వ్రుధా కాకుండా ఉండడానికే ప్రభుత్వం ఈవిధంగా చర్యలు తీసుకుందన్నారు. అయితే వచ్చే ఏడాది నుంచి మాత్రం విద్యార్థులంతా పూర్తిగా నీట్ కు సంసిద్దమవ్వాలన్నారు. ఏపీని భవిష్యత్తులో నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పిన ఆయన నీట్ కోసం ప్రభుత్వం తరుపున శిక్షణ కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు.

నాలెడ్జ్ హబ్ కి తగ్గట్టే, ఏపీ విద్యార్థులు ఐఐటీ, సివిల్స్ లో సత్తా చాటుతున్నారని అందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. నాలెడ్జ్ హబ్ లో భాగంగానే ప్రతి కాలేజీకి ఫైబర్ నెట్, డిజిటల్ క్లాస్ రూమ్స్, స్కూల్స్ లో వైఫై, బయోమెట్రిక్, అలాగే విద్యార్థులకు సంబంధించిన విషయాలను పేరెంట్స్ కి ఎప్పటికప్పుడు సందేశాలు ఈమెయిల్ ద్వారా అందజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు .
రానున్న రోజుల్లో 15వేల స్కూల్స్ లో నర్సరీ మొక్కలు నాటించడం, అంగన్ వాడీలను ప్రీ స్కూల్స్ గా మార్చడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు. 100 శాతం అక్షరాస్యతే ధ్యేయంగా భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications