వైసీపీ లక్ష్యంగా.. పార్లమెంట్లో పరీక్షలపై పుకార్లు వ్యాప్తి కట్టడికి కేంద్రానికి టీడీపీ ఎంపీ విజ్ఞప్తి!
ఏపీలో మెగా డీఎస్సీపై వైసీపీ, టీడీపీల మధ్య రగడ కొనసాగుతున్నవేళ లోక్ సభలో టీడీపీ ఎంపీ కేంద్రానికి కీలకసూచన చేశారు. లోక్ సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్ ) అమెండ్మెంట్ బిల్లు 2026పైన చర్చలో పాల్గొన్న టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కీలకవ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ పరీక్షలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై చర్యలు తీసుకునే నిబంధనలను బిల్లులో చేర్చాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
లోకేష్ నేతృత్వంలో కొత్త మెగా డీఎస్సీ పరీక్ష
2018 లో జరిగిన డీఎస్సీ పరీక్ష సమాధాన పత్రాలను, 2022లో మూల్యాంకనం చేశారని, ఆ ప్రక్రియ సరిగ్గా జరగలేదని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. అవకతవకల కారణంగా హైకోర్టు నియామక ప్రక్రియను రద్దు చేసిందని ఆయన వెల్లడించారు. 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ నేతృత్వంలో కొత్త మెగా డీఎస్సీ పరీక్షను నిర్వహించారని తెలిపారు.

ఉపాధ్యాయులుగా 16,347 మంది అభ్యర్థులు
రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండే విధంగా వీలైనంత ఎక్కువమందిని నియమించాలనే లక్ష్యంతో ఈ ఈ పరీక్ష జరిగింది అని వెల్లడించారు. ఈ పరీక్షను అధిక సంఖ్యలో అభ్యర్థులు రాశారని, నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని పేర్కొన్నారు. మొత్తం 16,347 మంది అభ్యర్థులు ఎంపికై ఏపీలో ఉపాధ్యాయ పోస్టులకు నియమితులయ్యారని అన్నారు.
డీఎస్సీ నియామక ప్రక్రియపై పుకార్లు, తప్పుడు నివేదికలు వ్యాప్తిపై ఎంపీ లావు
రాష్ట్రంలో వైసీపీ మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై పుకార్లు, తప్పుడు నివేదికలు వ్యాప్తి చేస్తుందన్నారు. కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులలో గందరగోళం సృష్టించటానికి ప్రయత్నం చేస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలకు కఠిన నిబంధనలు ఇందులో చేర్చాలన్నారు.
ఉద్దేశ పూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై చర్యలు
భవిష్యత్ లో ఈ చట్టాన్ని మరింత బలోపేతం చెయ్యాలని సూచించారు.ఉద్దేశ పూర్వకంగా తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాప్తి చేసే వారిని వదలొద్దని ఆయన అన్నారు. మెగా డీఎస్సి విషయంలో జగన్ ప్రధానికి లేఖ రాసిన క్రమంలో బిల్లుపై చర్చలో పాల్గొంటూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, భవిష్యత్తులో ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.
పుకార్లు వ్యాప్తి చేసేవారిపై చర్యలకు చట్టంలో నిబంధనలు
పరీక్ష పేపర్ లీక్లో పాల్గొన్నవారిపైనే కాకుండా, పబ్లిక్ పరీక్షలపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాప్తి చేసేవారిపై చర్యలు తీసుకునే నిబంధనలు చేర్చాలని సూచించారు. ఇలాంటి చర్యలు పరీక్ష వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆయన వాదించారు.












Click it and Unblock the Notifications