చంద్రబాబు, నారా లోకేష్కు మిగిలేవి అవే
Ambati Rambabu: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- నియోజకవర్గ స్థాయిలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఇన్ఛార్జీలను మార్చుతోంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం టికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తోంది. వాళ్లు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గాల్లో కొత్త వారికి ప్రాధాన్యతను ఇస్తోంది.
ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఓడిపోతామనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలను మార్చుతోందని, అయినప్పటికీ.. పరాజయం తప్పదనీ వ్యాఖ్యానించారు. ఇంకో నాలుగు నెలల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి రాబోతోన్నామని అన్నారు.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తిప్పికొట్టారు. తామే అధికారంలోకి వస్తామనే ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ.. ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో దిగాలనీ అన్నారు.
2014 నుంచి 2019 వరకు అద్భుతమైన పాలన అందించామని చంద్రబాబు చెబుతున్నారని, అలాంటి పాలనే అందిస్తామనే హామీతో ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. అలాంటి పాలన అందిస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారంటూ అంబటి రాంబాబు నిలదీశారు.
తమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేసి 151 సీట్లు గెలిచారని, ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా నిర్ణయాలను తీసుకుంటున్నారని చెప్పారు. గెలుపే ధ్యేయంగా కొన్ని సీట్ల మార్పులు జరుగుతున్నాయని వివరించారు. 60 శాతానికి పైగా ప్రజలు మళ్లీ జగన్నే సీఎంగా కోరుకుంటున్నారని అన్నారు.
కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేష్ మళ్లీ పోటీ చేసే వాతావరణం లేదని అంబటి అన్నారు. వారిద్దరికీ మిగిలేది శంకరగిరి మాన్యాలేనని సెటైర్లు వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను మోసం చేసిన టీడీపీ.. ఈ ఎన్నికల తరువాత భూస్థాపితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications